కేరళలోని శబరిమల ఆలయానికి భక్తుల రాక తగ్గిపోయింది. దీంతో ఆదాయం కూడా తగ్గింది. ఈ నెలలో జరిగిన ఉత్తరమ్ వేడుకతో పాటు మీనం నెల పూజల కోసం భక్తులకు అనుమతి ఇచ్చినా.. చాలా తక్కువ సంఖ్యలో భక్తులు ఆ కార్యక్రమాలకు హాజరయ్యారు. మార్చి 14 నుంచి మార్చి 28వ తేదీ వరకు అయ్యప్పస్వామి ఆలయాన్ని తెరిచి ఉంచారు. ఆ సమయంలో కేవలం 25,000 మంది భక్తులు మాత్రమే అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు.
శబరిమల దేవస్థానం బోర్డు 15 రోజుల్లో కేవలం 1.25 కోట్లు మాత్రమే ఆర్జించింది. 2019లో ఇదే సీజన్ లో ఆలయ బోర్డు సుమారు రూ.16 కోట్లు ఆర్జించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కరోనా నెగటివ్ సర్టిఫికేట్ ఉంటేనే భక్తులను శబరిమలకు అనుమతి ఇస్తున్నారు. ఆదాయం పడిపోవడంతో ఆలయ బోర్డు సాంప్రదాయబద్దంగా పంబా వద్ద నిర్వహించాల్సిన కొన్ని కార్యక్రమాలను నిలిపివేసినట్లు తెలుస్తోంది.