పాట్నా: త్వరలో జరుగనున్న పశ్చిమ బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలువాలని బిహార్లో అధికారంలో ఉన్న జనతాదళ్ యునైటెడ్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్లో 45 మందిని, అసోంలో 50 మంది అభ్యర్థులను ప్రకటించింది. సొంతంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని జేడీయూ నిర్ణయించడం పట్ల రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతున్నది.
కేంద్రంలో ఎన్డీఏతో కలిసి ఉన్న జేడీయూ.. బిహార్లో బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అయితే, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థులను నిలుపాలని నిర్ణయించడం వెనుక బీజేపీ మైండ్ గేమ్ ఉన్నదని పరిశీలకులు అంటున్నారు.
పశ్చిమ బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వెళ్తారా? లేదా? అనేది ఇంకా నిర్ణయం కాలేదు. కానీ పశ్చిమ బెంగాల్, అసోం ఎన్నికలలో జేడీయూ ఎంపీలు, బిహార్ మంత్రులు తమ కార్యకలాపాలను ఉధృతం చేయనున్నారు. ప్రచారం కోసం వారిని ఆయా రాష్ట్రాల్లో మోహరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లుగా తెలుస్తున్నది. ప్రస్తుతం గులాం రసూల్ బలియవి, పార్టీ జాతీయ కార్యదర్శి రవీంద్ర సింగ్ పశ్చిమ బెంగాల్లో క్యాంప్ చేస్తున్నారు.నాలుగో దశ నుంచి చివరి దశ వరకు జేడీయూ అభ్యర్థులు బరిలో కనిపిస్తారని అధికారికంగా సమాచారం అందింది. మొదటి దశలో ఐదుగురు అభ్యర్థులకు పార్టీ చిహ్నాలు అందివ్వగా.. వారిలో నలుగురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
దీని తరువాత పార్టీ కార్యాలయంలో అభ్యర్థుల నామినేషన్ పత్రాలను నింపే ప్రక్రియ ప్రారంభించారు. రెండు, మూడవ దశల్లో అరడజను మంది అభ్యర్థులు బరిలో ఉండనున్నారు. ఈ సంఖ్య నాలుగో దశ నుంచి పెరుగుతుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు బరిలో నిలిపిన 45 మందిలో చాలా మంది బిహార్, పూర్వంచల్ ప్రాంతాలకు చెందినవారున్నట్లు సమాచారం.
అసోంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటివరకు 50 మంది అభ్యర్థులకు జేడీయూ అధికారికంగా ప్రకటించింది. బిహార్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రావణ కుమార్ అక్కడ పరిస్థితులను పరిశీలిస్తున్నారు. టిన్సుకియా, సిల్చార్, నవగావ్, గౌహతి ప్రాంతాల్లో జేడీయూ కేంద్రీకృతమై ఉన్నదని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. బిహార్తో పాటు పూర్వంచల్ ఓటర్లు నిర్ణయం తేల్చే స్థితిలో చాలా ప్రాంతాలు ఉన్నాయి.