కృష్ణా జిల్లా నూజివీడులో రహదారి ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను నూజివీడు పోలీసులు రక్షించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం సాయంత్రం నూజివీడు పట్టణ పరిధిలోని అన్నవరం బైపాస్ రోడ్డు నందు ఎదురెదురుగా వస్తున్న లారీలు రెండు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు లారీలలో ఉన్న డ్రైవర్, సిబ్బంది క్యాబిన్ ఇరుక్కుపోయారు. సమాచారం తెలుసుకున్న నూజివీడు పట్టణ ఎస్ఐ గణేష్, బ్లూ కోట్స్ సిబ్బంది కానిస్టేబుల్ మల్లేశ్వరరావు, హోం గార్డ్ జీవన్ కలిసి క్యాబిన్ లో చిక్కుకుపోయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న డ్రైవర్లను బయటకు తీశారు.
వెంటనే అంబులెన్స్ సహాయంతో స్థానికంగా ఉన్న వైద్యశాలకు తరలించి వారి ప్రాణాలు నిలిపారు. క్షణం ఆలస్యం చేసినా ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్న వారిని వెంటనే ఆలస్యం చేయకుండా.. వైద్యశాలకు తరలించి వారి ప్రాణాలను నిలిపిన ఎస్సైని సిబ్బందినీ ఎస్పీ, నూజివీడు డిఎస్పీ, నూజివీడు సీఐ ప్రత్యేకంగా అభినందించారు.