ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ.. వాటిలోని తమ వాటాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఎయిర్పోర్టులపై ఫోకస్ పెట్టిన కేంద్రం.. వాటిలోని తన వాటాలను ఉపసంహరించుకోబోతున్నట్లు సమాచారం.
పెట్టుబడులను వెనక్కి తీసుకునే అంశంలో భాగంగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో కేంద్ర ప్రభుత్వం తన వాటాను అమ్మేసుకోవాలనుకుంటోంది. ఎయిర్పోర్ట్స్ అథార్టీ ఆఫ్ ఇండియాకి, తెలంగాణ ప్రభుత్వానికీ కలిపి.. ఈ ఎయిర్పోర్టులో 26 శాతం వాటా ఉంది. కేంద్రం తన వాటాను అమ్మేసుకోవాలనుకుంటున్నట్లు తెలిసింది. ఇలా వాటాలు అమ్మేసుకోవడం ద్వారా కేంద్రం రూ.2.5 లక్షల కోట్లు పొందాలనే లక్ష్యం పెట్టుకుంది. ఏప్రిల్ 1 నుంచి మొదలైన 2021-2022 ఆర్థిక సంవత్సరం.. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ముగిసే లోపు రూ.1.75 లక్షల కోట్లు పొందాలనేది కేంద్రం టార్గెట్. అందులో భాగంగా అవకాశం ఉన్న ప్రతీ దాన్నీ అమ్మేసుకుంటోంది. వాటిలో భాగంగానే ఎయిర్పోర్టులనూ అమ్మేయాలనుకుంటోంది.
ఇదివరకే హైదరాబాద్ ఎయిర్పోర్ట్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఎయిర్పోర్టులు ప్రైవేట్ పరం అయ్యాయి. త్వరలో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అందులో దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సమాచారం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మరో 13 ఎయిర్పోర్టులను కూడా కేంద్రం ప్రైవేటీకరణ చేయాలనుకుంటోంది. ఈమధ్యే ఈ నిర్ణయం తీసుకుంది.
ఆల్రెడీ అదానీ గ్రూపు.. గతేడాది ఇలాగే 6 ఎయిర్పోర్టులను సాధించుకుంది. ఏఏఐ చేతిలో 100కి పైగా ఎయిర్పోర్టులు ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుల్లో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి ఏఏఐ కి 26 శాతం చొప్పున వాటా ఉంది. ఢిల్లీ ఎయిర్పోర్టులో ఏఏఐ కి 26 శాతం వాటా ఉంది. ఈ వాటాలు అమ్మేస్తే.. కేంద్రానికి వేల కోట్లు వస్తాయి. నష్టాల్లో ఉన్నప్పుడు కేంద్రం ఆదుకోవాల్సిన భారం కూడా తప్పుతుంది. ఇలా క్రమంగా అన్ని రంగాల్లోనూ పెట్టుబడులను వెనక్కి తీసుకునేలా కేంద్రం ప్రణాళికలు వేసుకుంటోంది.