శ్రీకాకుళం జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన తల్లీకూతుళ్ల కేసులో మిస్టరీ వీడింది. ఏడాది వయసున్న పాపను, భార్యను భర్తే చంపేశాడు. శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్ పేట మండలం కోవిలాం గ్రామానికి చెందిన లత, రమేష్ దంపతులకు రెండేళ్ల కొడుకు, ఏడాది వయసున్న కూతురు ఉన్నారు. గురువారం ఉదయం శివరాత్రి సందర్భంగా అందరూ కలిసి గుడికి వెళ్లి వచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసి నిద్రపోయారు. అయితే రమేష్, అతడి సోదరుడు చిరంజీవి, వారి తల్లి కలిసి సాయంత్రం బయటకు వెళ్లి వచ్చారు. ఇంటికి వచ్చేసరికే లత ఇంకా నిద్రలేవకపోవడంతో ఆమెను లేపేందుకు ప్రయత్నించాడు. ఎంతకీ వారు లేవకపోవడంతో లాస్య, భార్య లత మరణించారని వారు గుర్తించారు.
భార్యాపాపను భర్తే చంపాడని లత తల్లి అంకమ్మ ఆరోపించింది. ఓ మహిళతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నందునే ఇలా హత్య చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న రమేష్ ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటకి వచ్చింది. తన ప్రియురాలి విషయమై తమ మధ్య గొడవలు జరిగాయని, అందుకే తన భార్యను చంపాలని నిర్ణయించుకున్నానని, గుడికి వెళ్లొచ్చాక.. నిద్రపోతున్న భార్య ముఖంపై దిండును అదిమి చంపేశానని, ఆ తర్వాత ఏడాది వయసున్న కూతురిని కూడా గొంతు నులిమి చంపేశానని నిందితుడు చెప్పాడు. మగబిడ్డ కనుక తన కొడుకును విడిచిపెట్టానని చెప్పాడు. ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకున్నానని, కానీ కుదరలేదంటూ అసలు నిజాన్ని ఒప్పేసుకున్నాడు. దీంతో పోలీసులు అతడిపై హత్య కేసు నమోదు చేశారు.