ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకంలో నగదుకు బదులుగా ల్యాప్ టాప్ తీసుకునే సదుపాయాన్ని కూడా కల్పించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కంప్యూటర్ స్కిల్స్ పెంచడంతో పాటు వారు ఆన్ లైన్ క్లాసులు వినడం కోసం వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు అప్పుడు ప్రకటించారు. అయితే అమ్మఒడి ల్యాప్టాప్లు ఎలా ఉంటాయనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అయితే ఈ ల్యాప్ టాప్ ఫీచర్లను కూడా ప్రకటించారు. ఇందులో 4 జీబీ ర్యామ్, 512 జీబీ హార్డ్ డిస్క్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉండనున్నాయి. వీటి ధర కూడా రూ.25,000 నుంచి రూ.27,000 మధ్య ఉండనుంది. దీంతోపాటు ఈ ల్యాప్టాప్లకు మూడు సంవత్సరాల పాటు వారంటీ కూడా ఉండనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
8వ తరగతి పైబడిన విద్యార్థులందరికీ వారి పాఠ్యాంశాల్లో కంప్యూటర్ లిటరసీ ప్రోగ్రాంను కూడా చేర్చనున్నారు. అంటే 8వ తరగతి నుంచే కంప్యూటర్ ఉపయోగించడాన్ని నేర్పిస్తారన్న మాట. దీని వల్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నేటి కంప్యూటర్ యుగంలో వెనకబడకుండా ఉంటారు. రూ.25,000 నుంచి రూ.27,000 ఖరీదైన ల్యాప్టాప్లను కేవలం రూ.18,500కే అందించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రివర్స్ టెండరింగ్ దీని ఖరీదును మరింత తగ్గించడానికి ప్రయత్నిస్తామన్నారు. దీంతోపాటు డిగ్రీ విద్యార్థులకు కూడా ఈ ల్యాప్టాప్లు అందించనున్నట్లు తెలిపారు.