ఏపీలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వేడుకల్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ముఖ్య అతిథిగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, రాష్ట్ర మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత శకటాల ప్రదర్శన జరిగింది. ఇటు రాష్ట్రవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వేచ్ఛా ఫలాలను మనకు అందించిన స్వాతంత్ర్య సమర యోధులను గుర్తు చేసుకోవాలని అన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా అందరూ శాంతి, అహింసలకు కట్టుబడి సోదర భావంతో మెలగాలని తెలిపారు. ప్రతి వ్యక్తీ దేశ నిర్మాణానికి కృషి చేయాలని గవర్నర్ అన్నారు.రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. మన రాజ్యాంగం ప్రపంచంలోనే ఎంతో గొప్పదని అన్నారు. రాజ్యాంగ స్పూర్తితోనే ఏపీలో 20 నెలలుగా పాలన కొనసాగుతోందని సీఎం జగన్ స్పష్టం చేశారు.