ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో నాటుసారా కలకలం సృష్టించింది. జిల్లాలోని సోంపేట మండలం సిరిమామిడిలో నాటుసారా తాగిన పలువురు అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి నాటుసారా తాగిన 25 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వాళ్లందరిని హరిపురం సామాజిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. రక్తపు వాంతులు అవడంతో మెరుగైన వైద్యం కోసం వాళ్లిద్దరినీ శ్రీకాకుళం జీజీహెచ్కు తరలించారు.
వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం, సిరమామిడి గ్రామంలో ఓ వ్యక్తి చనిపోయాడు. అంత్యక్రియలకు బంధువులు, గ్రామస్తులు హాజరయ్యారు. అంత్యక్రియలు పూర్తైన తర్వాత 25 మంది నాటుసారా తాగారు. కొద్దిసేపటికే అందరూ అస్వస్థతకు గురవడంతో ఒక్కసారిగా అందరూ ఆందోళనకు గురయ్యారు. కొందరు వాంతులు చేసుకోగా.. కొంతమంది కళ్లుతిరిగిపడిపోయారు. దీంతో స్థానికులు అందర్నీ హరిపురం ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో కారగి పాపరావు, కారగి రుద్రయ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు రక్తపు వాంతులు చేసుకోవడంతో వారిని శ్రీకాకుళంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఏఎస్పీ శ్రీనివాసరావు, కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితులు ఒడిశా నుంచి తీసుకొచ్చిన నాటుసారా తాగినట్లు తేల్చారు. జిల్లాలో ఇటీవల నాటుసారా బట్టీలపై పోలీసుల దాడులు పెరడగడంతో ఒడిశా నుంచి అక్రమంగా ఇక్కడికి తీసుకొస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఇటీవల ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో నాటుసారా కేసులు ఎక్కువవుతున్నాయి. రాష్ట్రంలో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో వరుస దాడుల నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం, నాటుసారా వంటివి అక్రమంగా రవాణా అవుతున్నాయి. సిరమామిడి గ్రామానికి ఇదే తరహాలో నాటుసారా సరఫరా అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గ్రామంలోని నాటుసారా ఎవరు తీసుకొచ్చారు స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.