చిమ్మిరి బండ వాసుల చిరకాల స్వప్నం నెరవేరింది. చిమ్మిరి బండ వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో చుట్టుపక్కల గ్రామాలకు వర్షాకాలంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయేవి. దీంతో జనజీవనం స్తంభించి పోయేది. ఏళ్ళ తరబడి బ్రిడ్జి నిర్మాణానికి నోచుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.ఈ సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2018 మార్చిలో బ్రిడ్జి నిర్మాణానికి పిఎంజిఎస్ వై నిధులు రూ. 3.2 కోట్లు మంజూరు చేయించారు. 2019లో బ్రిడ్జి నిర్మాణ పనులకు టెండర్లు పూర్తి చేసిన అధికారులు శర వేగంగా బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేశారు. అనేక ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను ఎమ్మెల్యే ఏలూరి పరిష్కరించారని కొనియాడారు. ఈ సందర్భంగా తాము పడిన కష్టాలను ఆయా గ్రామాల ప్రజలు గుర్తుచేసుకున్నారు. బ్రిడ్జి నిర్మాణం తో చిమ్మిరి బండ, ద్రోణాదుల, నాగండ్ల, ఇడుపులపాడు,ఇంకొల్లు ప్రాంతాల ప్రజలకు రవాణా వ్యవస్థ మెరుగుపడింది. ఎన్ హెచ్ 5 నుంచి ఇంకొల్లు వెళ్లేందుకు బ్రిడ్జి నిర్మాణంఎంతగానో ఉపయోగపడనుంది.