ఓ పూజారి.. ఓ బాలికకు స్నాక్స్ ఇప్పిస్తానని ఆశ చూపి గదిలోకి పిలిచి వేధింపులకు పాల్పడ్డ ఘటన కర్ణాటకలోని దేవనహల్లిలో మంగళవారం సాయంత్రం జరిగింది. వెంకటరమణప్ప అనే వ్యక్తి బాగేపల్లిలోని ఓ ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. ఇటీవల అతడు దేవనహల్లిలో ఉంటున్న తన కుమార్తె-అల్లుడిని చూసేందుకు అక్కడికి వెళ్లాడు. అక్కడ అల్లుడు ఓ ఫంక్షన్ నిమిత్తం బయట ఊరికి వెళ్లడంతో.. ఆలయంలో పూజలు నిర్వహించే బాధ్యతను వెంకటరమణప్పకు అప్పగించారు. అయితే వెంకటరమణప్ప పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. ఆలయం సమీపంలోని ఓ రూమ్ సమీపంలో ఆడుకుంటున్న పిల్లల్లో ఓ పదేళ్ల బాలికకు స్నాక్స్ ఇపిస్తానని చెప్పి తన గదికి పిలిచాడు. అదే సమయంలో తమ కుమార్తె కోసం వెతుకుతూ బాలిక తల్లి వెతుకుతుండగా.. గుడి వద్ద పూలు అమ్మే వ్యాపారి ఒకరు.. బాలిక పూజారి రూమ్ లోకి వెళ్లిందని చెప్పాడు.
దీంతో బాలిక తల్లి మరికొందరు కుటుంబసభ్యులతో కలిసి పూజారి ఉన్న రూమ్ వద్దకు వెళ్లింది. అప్పుడు బాలిక ఏడుస్తూ బయటికి రావడం వారు చూశారు. లోపల పూజారి తనతో ప్రవర్తించిన తీరును బాలిక కుటుంబ సభ్యులకు చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పూజారిని అరెస్ట్ చేశారు. పూజారి వెంకటరమణప్పపై పొక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పూజారి గదిలోకి వెళ్లిన బాలిక వెంటనే తిరిగి బయటకు రాలేదని.. రెండు మూడు నిమిషాల తర్వాత ఆ రూమ్ నుంచి బయటకు వచ్చినట్టు సీసీటీవీలో రికార్డు అయిందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.