ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని కోలమాన్ పేట గ్రామానికి చెందిన బోయ కిందింటి గోవిందు(55) పొలంలో దారుణ హత్యకు గురయ్యాడు. పొలంలో పత్తి కోతలకు గోవిందు, తన భార్య తిక్కమ్మ, కుమార్తెతో కలిసి వెళ్లారు. సాయంత్రం కాగానే భార్య, కుమార్తెలను ఇంటికి పంపాడు. చీకటి పడుతున్నా.. గోవిందు ఇంటికి రాకపోవడంతో అతని కుమారుడు పొలానికి వెళ్లి చూడగా తండ్రి రక్తపుమడుగులో విగత జీవిలా పడి ఉన్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గోవిందు శరీరంపై పదునైన ఆయుధంతో నరికినట్లు ఆనవాళ్లు ఉండడంతో హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు గోవిందు భార్య వైసీపీలో కీలక కార్యకర్తగా పనిచేస్తున్నారు. పాత కక్షలతోనే తన భర్తను హత్య చేసి ఉంటారని భార్య ఆరోపించారు.