ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పన్నుల పెంపు పై అసత్యాలు నమ్మవద్దు: బొత్స

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 26, 2020, 12:19 PM

స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్రంలో ఇంటి పన్నును 15 శాతానికి మించకుండా పెంచాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గతంలో ఇంటి పై వచ్చే ఆదాయంపైన పన్ను విధించే వారని.. ఇకపై ఆస్తి విలువ పై పన్ను విధించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దీన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ పన్ను పెంపు అమల్లోకి వచ్చిందన్నారు. మొత్తం ఆస్తి విలువపై 0.10 శాతం నుంచి 0.50 శాతం పన్ను వేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు కడుతోన్న పన్ను కంటే 10 నుంచి 15 శాతం పన్ను మాత్రమే పెంచాలని ఆదేశాల్లో తెలిపారన్నారు.
ప్రభుత్వంపై కొందరు కావాలని బురదజల్లుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర జరుగుతోందన్నారు. రాష్ట్రంలో 377 చదరపు అడుగుల లోపు ఉండే ఇంటికి 50 రూపాయలు మాత్రమే ఇంటి పన్ను ఉంటుందని... అంతకన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఉండదన్నారు. మిగిలిన చోట కూడా ఆస్తి విలువ మేరకు ప్రస్తుత పన్నుపై 0.10 నుంచి 0.50 వరకు పన్ను పెరుగుతుందని బొత్స స్పష్టం చేశారు. నీటిపన్ను పెంపుపై 2018 లో ఆదేశాలు వచ్చాయన్న బొత్స.. ఇంటి పన్నులాగా నీటి పన్ను కూడా 15 శాతానికి మించి పెరగదన్నారు. 100 నుంచి గరిష్ఠంగా 350 రూపాయలు మించి నీటి పన్ను ఎక్కువగా ఉండకూడదని నిర్ణయించామన్నారు. ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకున్నామని.. ప్రజలు అసత్యాలను నమ్మవద్దని బొత్స సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com