వైఎస్ఆర్ చేయూత, ఆసరా కార్యక్రమాల లబ్ధిదారులైన మహిళలకు పాడి పశువులు, గొర్రెలు, మేకల పంపిణీపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా లబ్ధిదారులు, వారికి ఇవ్వనున్న పాడి పశువులు తదితర అంశాలపై నిశితంగా సమీక్షించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,11,780 ఆవులు, 2,57,211 గేదెలు, 1,51,671 గొర్రెలు, 97,480 మేకల పంపిణీకి ప్రభుత్వం ప్రణాళిక వేసింది.
లబ్ధిదారులకు ఇవ్వనున్న ప్రతి పశువునూ పశు సంవర్థక శాఖ అధికారులు భౌతికంగా తనిఖీ (ఫిజికల్ వెరిఫికేషన్) చేయనున్నారు. లబ్ధిదారుల జాబితాను ఆర్బీకేల పరిధిలో రిజిస్టర్ చేయనున్నారు. అలాగే, ప్రతి నెలా పశువు అరోగ్యాన్ని డాక్టర్ పరిశీలిస్తారు. పాడి పశువుకు ఇచ్చే ఆరోగ్య కార్డులో ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేస్తారు. అలాగే పాడి పశువు ఇచ్చే పాల దిగుబడి కూడా నమోదు చేస్తారు. నవంబరు 26 నుంచి తొలిదశలో పాడి పశువుల పంపిణీ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. వర్చువల్ విధానంలో 4 వేల గ్రామాల్లో పంపిణీని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. తొలుత ప్రకాశం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాల్లో పంపిణీ చేస్తారు. తర్వాత దశల వారీగా పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని జగన్ సూచించారు.
ఈ పథకం కింద పెట్టిన పెట్టుబడికి కచ్చితంగా గిట్టుబాటు రావాలని సీఎం జగన్ అన్నారు. అందుకే జాతుల ఎంపికలో జాగ్రత్త వహించాలన్నారు. కొనుగోలు కమిటీ బలంగా ఉండాలని, కమిటీలో కచ్చితంగా సాంకేతిక నైపుణ్యం కలిగిన వారు ఉండాలన్నారు. బీమా సంస్థ ప్రతినిధితో పాటు, బ్యాంకర్ కూడా ఆ కమిటీలో సభ్యులుగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. వెటర్నరీ సర్వీసులు కూడా బలోపేతం చేయాలని ఆదేశించారు. అందుకోసం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసుకోవాలని సీఎం జగన్ సూచించారు.
పాడి పశువులకు ఎలాంటి సమస్య వచ్చినా ఆర్బీకేల పరిధిలో వెంటనే వాటికి వైద్యం అందాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆ స్థాయిలో అధికారులు సన్నద్ధం కావాలని నిర్దేశించారు. ఆర్బీకేల పరిధిలో ఏర్పాటు చేస్తున్న వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాలను పశువుల వైద్యానికి వినియోగించుకోవాలని సీఎం సూచించారు. కాల్ సెంటర్ల ఏర్పాటు, వాటి ద్వారా వైద్యం అందేలా చూడాలని చెప్పారు. పశు దాణా కూడా సక్రమంగా సరఫరా అయ్యేలా చూడాలన్నారు. పశు దాణాలో రసాయనాలు లేకుండా చూడాలని చెప్పారు. సహజమైన పదార్థాలతో దాణా తయారయ్యేలా చూడాలని సీఎం అన్నారు. సేంద్రీయ పద్దతులకు పెద్ద పీట వేయాలన్నారు. సేంద్రీయ పాలు, సేంద్రీయ మాంసం ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దీని వల్ల మరింత ధర లభించే అవకాశం ఉంటుందని చెప్పారు. సేంద్రీయ పాల బ్రాండ్ను మరింత ప్రమోట్ చేయాలని, దీనిపై మహిళలకు మరింత అవగాహన కల్పించాలని సీఎం జగన్ చెప్పారు.
చేయూత, ఆసరా పథకాల కింద గ్రామాల్లో మహిళలు ఏర్పాటు చేసుకున్న చిల్లర దుకాణాలపై సీఎం సమీక్షించారు. ఇప్పటి వరకూ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో కలిపి 78 వేల దుకాణాలు ప్రారంభం అయ్యాయని అధికారులు జగన్కు తెలిపారు. చేయూత కింద కొత్తగా లబ్ధి పొందిన 2.78 లక్షల మంది నుంచి కూడా ఆప్షన్లు తీసుకోవాలని సీఎం సూచించారు. వారు కూడా సుస్థిర జీవనోపాధి పొందేలా చూడాలని చెప్పారు.