రాష్ట్రంలో కరోనా కేసులు ఉన్న దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఏపీ సీఎస్ నీలం సాహ్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్కు రాసిన లేఖపై సిఇసి ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ మేరకు సిఎస్ కు ఎస్ ఎం ఎస్ సందేశం పంపారు.. ‘మీ లేఖ ఎన్నికల కమిషన్ స్వయంప్రతిపత్తిని ప్రశ్నించడమే. రాజ్యంగ వ్యవస్థను కించపరచడమే. రాజ్యాంగ, చట్ట విరుద్ధం” అని అందులో పేర్కొన్నారు.. కాగా, అంతకు ముందు సిఎస్ తన లేఖలో ”కరోనా కట్టడికి రాష్ట్రాలు వాటి పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకున్నాయి. ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదు. చలికాలంలో మరింత అప్రమత్తత అవసరమని కేంద్రం హెచ్చరించింది. ఏపీలో 6,890మంది కరోనా వల్ల మృతి చెందారు. మరోసారి కరోనా ప్రబలేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు నిర్వహిస్తే గ్రామీణ ప్రాంతాలకు కరోనా వ్యాపించే ప్రమాదముంది. ఇప్పటికే పరిపాలన సిబ్బంది, పోలీస్ సిబ్బంది, వివిధశాఖల ఉద్యోగులు కరోనా కట్టడికి కృషి చేస్తున్నారు. స్థానిక సంస్థల నిర్వహణకు పరిస్థితి అనుకూలించిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణపై సమాచారం ఇస్తాం. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. ఎన్నికల నిర్వహణపై మీ నిర్ణయాన్ని పునరాలోచన చేయాలి. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్టు మా దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ అవసరం లేదని మేము భావిస్తున్నాం” అని పేర్కొన్నారు. దీనిపై నిమ్మగడ్డ ఎస్ ఎం ఎస్ రూపంలో స్పందించారు.