ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లోకి ఒరిస్సా ప్రభుత్వం చొరబడింది. ఆంధ్రకు చెందిన బోర్డులను తీసి ఒరిస్సాకు చెందిన బోర్డులను పాతారు. దీంతో ఆంధ్ర,ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతవరణం రాజుకుంటుంది. ప్రభుత్వం దృష్టి సారించకపోవతే ఏం జరుగుతుందో తెలుసా? ఆంధ్ర,ఒరిస్సా సరిహద్దు వివాదంపై ఏబీఎన్ ప్రత్యేక కథనం.
విశాఖ మన్యంలో రోజురోజుకు సరిహద్దు వివాదం ముదురుతోంది. విశాఖజిల్లా డుంబ్రిగూడ మండలం కొల్లాపుట్ పంచాయితీలో గల ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతుంది. దీనిని ఆదిలోనే పరిష్కరం చూపకపోతే... రాను రాను మరింత జఠిలంగా మారే ఆవకాశాలున్నాయని స్థానిక ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. 1953లో మద్రాసు నుంచి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినప్పుడు నిర్ణయించిన సరిహద్దును పక్కనపెట్టారు. ఈనెల 9వ తేదిన ఒరిస్సా సబ్ కలెక్టర్, పొట్టంగి ఎమ్మెల్యే దూకుడు ప్రదర్శించారు. ఆంధ్ర సరిహద్దు లోపలికి వచ్చి ఆంధ్రకు సంబంధించిన బోర్డులను తీసి ఒరిస్సా ప్రభుత్వానికి సంబంధించిన బోర్డులను పాతారు. అంతేకాకుండా... ఈ భూమి తమకు సంబంధించినదిగా చెప్తూ.... ఎవరైనా ఆ స్థలంలోకి అడుగుపెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిర్ణయించారు. దీంతో అక్కడ జీవిస్తున్న గిరిజన రైతులు అమోమయంలోకి వెళ్లిపోయారు. తమ సమస్యను ఎవరికి చెప్పాలో... తెలియక తలలు పట్టుకుంటున్నారు.
ఒరిస్సా సరిహద్దును దాటి ఆంధ్రా సరిహద్దులోకి సుమారు 600 మీటర్లు చొచ్చుకుని వచ్చారు. డుంబ్రిగుడ మండలం కొల్లాపుట్ పంచాయతీకి చెందిన డెక్కపాడు, బొడ్ల మామిడి, నెట్ట మామిడి, కొల్లాపుట్ గ్రామాలకు చెందిన భూములు ఒడిషా ప్రస్తుతం అక్రమించిన పరిథిలోకి వెళ్లిపోతుంది. దీంతో సంబంధిత గ్రామాల సుమారు మూడు వేల మంది గిరిజనులు పోరు బాట పట్టారు. తమ సమస్యను ఇప్పుడు పరిష్కరింకోకపోతే... పిల్లలతో పాటు రోడ్డున పడతామంటూ గిరిజన గ్రామల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతాల్లోకి ప్రవేశించి భూమి తమదేనంటూ మొండిగా ఒరిస్సా ప్రభుత్వం వ్యవహారించడాన్ని ఆయా గ్రామాల ప్రజలు తప్పుపడుతున్నారు. ఒడిషా ప్రభుత్వం నిర్ణయించిన విధంగా సరిహద్దు అమలైతే డెక్కపాడు గ్రామంతో పాటు మిగిలిన గ్రామాలకు చెందిన సుమారు ఐదు వందల ఎకరాల సాగు భూమి, పోడుభూములు పూర్తిగా ఒడిషా లోకి వెళ్లిపోతాయని అక్కడ రైతులు వాపోతున్నారు. దీంతో ఆదీవాసిలు తమ హక్కులను కాపాడుకునేందుకు ఉద్యమం బాట పట్టారు.