ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్య దారుణ హత్య.. భర్త ఏమయ్యాడో..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 16, 2020, 12:36 PM

ప్రకాశం జిల్లాలో మహిళ దారుణ హత్య కలకలం రేపుతోంది. మార్టూరు మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన వివాహిత దారుణ హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లక్కవరం ఎస్సీ కాలనీకి చెందిన మద్దుమాల పద్మ(38), భాస్కర్‌రావు భార్యభర్తలు. దంపతులు ఉన్నత విద్యావంతులు కావడంతో కనిగిరిలో ప్రైవేట్‌ స్కూల్‌లో గత కొన్నేళ్లుగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా స్వగ్రామంలో ఉంటూ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు చెప్తున్నారు. అయితే శుక్రవారం సాయంత్రం యుద్దనపూడి మండలంలోని పూనూరులో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి స్వగ్రామం బయలుదేరి రాత్రికి ఇంటికి చేరుకోలేదు. దీంతో కంగారు పడ్డ బంధువులు మార్టూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ద్వారా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే కోనంకి, లక్కవరం గ్రామాల మధ్య పంట కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం పడి ఉన్నట్లు శనివారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం అందింది. సిబ్బందితో ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించిన ఎస్సై శివకుమార్‌ మహిళ మృతదేహం శుక్రవారం రాత్రి కన్పించకుండా పోయిన పద్మదిగా గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. అనంతరం శనివారం రాత్రి మార్టూరు ప్రభుత్వాసుపత్రికి తరలించిన పద్మ మృతదేహానికి ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. ఇదిలా ఉంటే భార్య భర్తలు ఇద్దరూ కలిసి వెళ్లగా పద్మ హత్యకు గురవ్వడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. భర్త భాస్కరరావు ఆచూకీ ఇంత వరకు తెలియకపోవడం కలకలం రేపుతోంది.
భాస్కరరావు అనుమానంతో భార్య పద్మను తరచూ వేధిస్తూ ఉండేవాడని, అతడే చంపి ఉంటాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలికి కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం నివేదిక, భాస్కరరావు ఆచూకీ తెలిస్తే గానీ హత్యకు గల కారణాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం లేదు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చీరాల డీఎస్పీ వేణుగోపాల్‌ సోమవారం సాయంత్రాన్ని సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com