తిరువనంతపురం: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో భక్తుల కోలాహలం మొదలైంది. ఆలయ మండలి నేటి నుంచి భక్తులకు అయ్యప్ప దర్శనానికి అనుమతించింది. రోజుకు కేవలం వెయ్యి మంది భక్తులకు మాత్రమే ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది. వారాంతాల్లో రెండు వేల మందిని అనుమతించాలని ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు. 2 నెలలపాటు వార్షిక మండల, మకరవిళక్కు పూజలు జరుగుతున్న నేపథ్యంలో దర్శనాలకు అనుమతిస్తున్నారు. భక్తులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. 60 ఏళ్లు పైబడిన, పదేళ్ల లోపు వారికి దర్శనానికి అనుమతి లేదని ఆలయ మండలి స్పష్టం చేసింది. కరోనా లక్షణాలు ఉన్నవారు, ఇటీవల కరోనా నుంచి కోలుకున్న వారు ఆలయానికి రావొద్దని సూచించింది.