అంబానీ సోదరులు, వారి కుటుంబసభ్యులకు జెడ్ ప్లస్ భద్రతను ఉపసంహరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. కానీ తమ ప్రాణాలకు ముప్పు ఉందని గ్రహించి, దాని కోసం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నవారికి పోలీసులు ఉన్నతస్థాయి భద్రతను కల్పించాలన్న బొంబాయి హైకోర్టు నిర్ణయాన్ని సమర్ధించింది. అంబానీ సోదరులకు జెడ్ ప్లస్ భద్రతను ఉపసంహరించాలని కోరుతూ హిమాన్షు అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు.
అంబానీ సోదరులు అత్యంత ధనవంతులని, వారు సొంతంగా సెక్యూరిటీని ఏర్పాటుచేసుకోగలరని హిమాన్షు అగర్వాల్ తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై బాంబే హైకోర్టు స్పందిస్తూ.. ‘అటువంటి వ్యక్తులకు భద్రత కల్పించడం సహా శాంతి భద్రతలను కాపాడటం ప్రభుత్వం విధి.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కార్పొరేషన్ ఆదాయం దేశ జీడీపీలో గణనీయమైన ప్రభావం చూపుతుంది..
ప్రైవేట్ వ్యక్తుల భద్రతను నిరాకరించడాన్ని తేలికగా విస్మరించలేం.. ఓ ఉగ్రవాద సంస్థ నుంచి బెదిరింపులు వచ్చాయని తెలిసిన తర్వాత ఆ వ్యక్తులు, వారి కుటుంబసభ్యుల ప్రాణాలను కాపాడటానికి ప్రభుత్వం తప్పనిసరిగా భద్రత కల్పించాలి’అని పేర్కొంది.ప్రైవేటు వ్యక్తులకు జెడ్ ప్లస్ భద్రత కొనసాగింపు విషయంలో నిజమైన ముప్పు ఉందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని, ఇది కేంద్ర ప్రభుత్వ వనరులలో ఒక భాగం అనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పిటిషనర్ వాదించారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాయర్లు ఎవరైనా హాజరయ్యారా? అని ధర్మాసనం ప్రశ్నించింది.
ప్రతివాదుల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి మాట్లాడుతూ.. ‘పారిశ్రామికవేత్తలు, వారి కుటుంబాలకు ముప్పు ఉందని గ్రహించారు.. ప్రభుత్వం మాకు కల్పించిన భద్రతకయ్యే ఖర్చులను మేము చెల్లిస్తున్నాం’ అని చెప్పారు. ఈ సమయంలో పిటిషనర్ తరఫు లాయర్ కరణ్ భరిహోక్ కలుగజేసుకుంటూ ప్రాణహాని అనేది వ్యక్తిగత అవగాహన.. రక్షణ కల్పించాలంటే బెదిరింపులు, భద్రతకు మధ్య సహేతుకమైన సంబంధం ఉండాలని అన్నారు.