బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో విషాదం జరిగింది. హిసువా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఫుల్మా గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ 258 బీజేపీ పోలింగ్ ఏజెంట్ కృష్ణ కుమార్ సింగ్ గుండెపోటుతో కన్నుమూశారు. పోలింగ్ బూత్లో కూర్చోగానే అకస్మాత్ముగా ఛాతీలో నొప్పి వచ్చిందని, చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా ఆయన మరణించాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
బీహార్లో తొలి విడతలో భాగంగా 71 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. 2 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 9 గంటల ప్రాంతానికి 6.03 శాతం పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. ఈ పోలింగ్లో మొత్తం 1,066 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో 952 మంది పురుషులు కాగా, 114 మంది మహిళలు ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఓటర్లు కొవిడ్ నిబంధనలు పాటించి ఓటు వేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వద్ద గరిష్ఠంగా వెయ్యి మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. 80 ఏళ్లు పైబడిన వారికి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్లు, థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేశారు.