దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పతాక స్థాయికి చేరింది. దీంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చేపే అవకాశం ఉందని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ) తెలిపింది. అలీపూర్లో గాలి నాణ్యత సూచి (ఏక్యూఐ) 432, ముండ్కాలో 427, వజీపూర్లో 409 నమోదైంది. గాలి నాణ్యత 0-50 మధ్య ఉంటే శుద్ధమైందిగా, 51-100 మధ్య సంతృప్తికరంగా, 101-200 మితంగా, 201-300 మధ్య పేలవమైన, 301-400 చాలా పేలవమైన, 401-500 తీవ్రమైన కాలుష్యంగా పరిగణిస్తున్నారు. కాలుష్యం పెరుగడంతో ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులను ఎదుర్కొంటున్నారు. మరికొందరు పిల్లలు గొంతు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎట్టిపరిస్థితుల్లో బయటకు రావొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
వాయుకాలుష్యం జరుగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు, నిర్మాణ సంస్థలు, మున్సిపల్ సంస్థలు, ట్రాఫిక్ పోలీస్, ఎన్సీఆర్ సహా పలు సంస్థలు, ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఇటీవల కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ఢిల్లీ హైకోర్టుకు ఇటీవల నివేదిక సమర్పించింది. రాబోయే రోజుల్లో వాయుకాలుష్యాన్ని అరికట్టేందుకు పటాకలు కాల్చడం, దిష్టిబొమ్మల దహనంపై కఠిన నిషేధం విధించేలా సాధ్యమైనంత తర్వగా ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)లకు ఆదేశాలివ్వాలని శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దసరా పండుగను పురస్కరించుకొని పర్యావరణ అనుకూల మార్గాలపై కేంద్ర పర్యావరణ శాఖ, ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో దసరా పండుగ సందర్భంగా ఢిల్లీలో పటాకలు కాల్చడంపై నిషేధం విధించేలా తగిన చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు కోర్టును కోరారు.