ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్యాన్సర్ తో బాధపడుతున్న మహిళలకు గుడ్ న్యూస్.. ఆ మందులతో క్యాన్సర్‌ తగ్గుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 23, 2020, 05:18 PM

మహిళలకు బాధ్యతలు ఎక్కువ.. ఒత్తిడి.. మానసిక ఆందోళనలు ఎక్కువగానే ఉంటాయి. అంతేకాదు అనేక రకమైన ఆరోగ్య సమస్యలు కూడా మహిళలను చుట్టుముడుతుంటాయి. ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్, షుగర్, బీపీ, బ్లీడింగ్ ఎక్కువగా కావడం, నడుము నొప్పి ఇలాంటి సాధారణమైన వాటితో పాటు పెద్ద పెద్ద వ్యాధుల బారిన కూడా పడుతుంటారు. అలా మహిళలకు క్యాన్సర్ల ముప్పు ఎక్కువ.
అందులోనూ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా తలెత్తే ప్రమాదం ఉంటుంది. అలాగే కొలొరెక్టల్ (పెద్ద పేగు) క్యాన్సర్, మెలనోమా వంటి క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ఈ క్యాన్సర్లతో బాధపడుతున్న మహిళలకు ఓ తీపి కబురు అందింది. కొవ్వును తగ్గించే మందులే క్యాన్సర్‌‌కు విరుగుడుగా పనిచేస్తాయట. పలు పరిశోధనల్లో ఈ విషయం తెలిసింది.
వివిధ క్యాన్సర్లతో బాధపడుతున్న మహిళలు.. కొవ్వు తగ్గేందుకు వాడే మందులతో మరణాన్ని జయిస్తున్నారట. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ క్లీనికల్ ఫార్మకాలజీలో పబ్లిష్ అయిన ఓ విశ్లేషణ ప్రకారం ఈ విషయం వెల్లడైంది. ఆస్ట్రేలియాలో రొమ్ము, కొలోరెక్టల్, మెలనోమా క్యాన్సర్లకు చికిత్స పొందిన 6,430 మంది మహిళల ఆరోగ్య పరిస్థితులను 2003 నుంచి 2013 వరకు పరీక్షించారు. రోగ నిర్ధారణకు ముందుగానే వీరికి శరీరంలో కొవ్వును తగ్గించే మందులను అందించారు. ఈ సందర్భంగా కొందరు మహిళల్లో మార్పును గమనించారు. వీరిలో క్యాన్సర్ నిర్ధారణకు జరిగిన తర్వాత కూడా చనిపోయే ముప్పు తక్కువగా కనిపించినట్టు గుర్తించారు.
కొవ్వు తగ్గేందుకు ఉపయోగిస్తున్న మందుల్లో ఉండే యాంటీ ట్యూమర్ గుణాల వల్లే వారు.. క్యాన్సర్‌ మరణాల నుంచి బయటపడుతున్నట్టు నిపుణులు భావిస్తున్నారు.
కొవ్వు తగ్గించే ముందులకు క్యాన్సర్ కణాలతో పోరాడే సామర్థ్యం ఉన్నట్లు ధృవీకరించబడితే.. భవిష్యత్తులో ఆ మందులు రోగులకు ఎంతో ఉపయోగకరంగా మారతాయని నిపుణులు అంటున్నారు.
మహిళలకు ఇది నిజంగా శుభవార్తే అని చెప్పుకోవాలి. అయితే లోతైన పరిశోధనలు అవసరమని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే క్యాన్సర్ల బారిన పడిన మహిళలకు కుంగిపోకుండా ఉండడానికి ఇలాంటి విషయాలు దోహదపడతాయి. కానీ వైద్యుల సూచనల మేరకు మాత్రమే ఏ మందులైనా వాడాలి. ఇలాంటి అంశాలపై మహిళలకు ఓ అవగాహన రావడానికి ఈ సమాచారాన్ని షేర్ చేయండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com