చైనాతో ఎల్ఏసీ వద్ద నెలకొన్న వివాదం నేపథ్యంలో భారత్ తన అమ్ముల పొదిలో అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. వరుస క్షిపణి ప్రయోగాలతో భారత్ దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే రఫెల్ యుద్ధ విమానాలను భారత్కు తీసుకొచ్చారు. ఇక, భారత్ బ్రహ్మోస్ క్షిపణి వంటి వాటిని విజయవంతంగా ప్రయోగించింది. దీంతో ఈ రెండు నెలల్లో భారత్ పదుల సంఖ్యలో మిస్సైల్స్ పరీక్షించింది.
తాజాగా భారత నావికాదళం శుక్రవారం యాంటీషిప్ మిస్సైల్ను విజయవంతంగా పరీక్షించింది. ఐఎన్ఎస్ ప్రభల్ నుంచి ఆ క్షిపణి పరీక్ష జరిగింది. గోదావరి క్లాస్కు చెందిన ఫ్రిగేట్ నౌకను.. ఆ మిస్సైల్ ధ్వంసం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఇండియన్ నేవీ విడుదల చేసింది. టార్గెట్ నౌకను మిస్సైల్ తునాతునకలు చేసినట్లు నావీ అధికారులు తెలిపారు. అతిదూరంగా ఉన్న టార్గెట్ను అత్యంత కచ్చితత్వంతో పేల్చేశారు. క్షిపణి తాకిడికి టార్గెట్ నౌక సముద్రంలో మునిగిపోయింది. ఐఎన్ఎస్ ప్రభల్ లో రష్యా తయారీకి చెందిన కేహెచ్-35 ఉరాన్ యాంటీ షిప్ మిస్సైళ్లు ఉన్నాయి. ఈ క్షిపణులు గరిష్టంగా 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను పేల్చేస్తాయి. అయితే, ఇవాళ మిస్సైల్ పరీక్షలో ధ్వంసమైన గోదావరి క్లాస్ ఫ్రిగేట్ను 1983లో కమిషన్ చేశారు. యుద్ధనౌక నుంచి మిస్సైల్ పరీక్ష జరిగిన నేపథ్యంలో నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ పరిస్థితులను సమీక్షించారు. కాగా, ఐఎన్ఎస్ కారవత్తిని నేవీలోకి గురువారమే ఇండక్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.