భారత్లో కరోనావైరస్ కేసులు, మరణాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఎలాగైనా కోవిడ్ 19 టికా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో భారత ప్రభుత్వ సహకారంతో ఫార్మా కంపెనీలు క్లినికల్ ట్రయల్స్ను వేగవంతం చేశాయి. ఈ నేపథ్యంలోనే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో హైదరాబాద్ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కొవిడ్-19 వ్యాక్సిన్ కోవ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్కు ఆమోదం లభించింది. మొదటి, రెండో దశ ట్రయల్స్లో ఈ వ్యాక్సిన్ ద్వారా ఆశాజనకమైన ఫలితాలు రావడంతో డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా కోవ్యాక్సిన్ మూడోదశ ప్రయోగాల కోసం అనుమతి ఇచ్చింది.
మొదటి, రెండవ విడత ట్రయల్స్లో ఈ వ్యాక్సిన్ ద్వారా ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయా లేదా అన్న విషయాన్ని ముందు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిపుణుల బృందం పరిశీలించింది. ఆతర్వాత దీనికి సంబంధించిన పూర్తివివరాలతో హైదరాబాద్ భారత్ బయోటెక్ అక్టోబరు 2న మూడో దశ ట్రయల్స్ కోసం డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసింది. అంతకుమందు భారత్ బయోటెక్ సంస్థ వాలంటిర్స్పై ప్రయోగం చేసిన అనంతరం అనంతరం జంతువులపై కూడా ప్రయోగాల కోసం డీజీసీఐ అనుమతిఇచ్చింది. ఈ ప్రయోగ ప్రక్రియలో కోవ్యాక్సిన్ సురక్షితమైందని.. యాంటీబాడీలను సైతం ఉత్పత్తి చేస్తున్నట్లు సంస్థ డీజీసీఐకి దరఖాస్తు చేయగా.. మూడో దశ ప్రయోగాలకు గురువారం అనుమతి ఇచ్చింది.
అయితే ఈ వ్యాక్సిన్ను 18 ఏళ్లు పైబడిన 28,500 మందికి ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే 28 రోజుల్లో రెండు మోతాదుల వ్యాక్సిన్ను ప్రయోగాత్మకంగా ఇవ్వనున్నారు. ఈ మేరకు ఢిల్లీ, ముంబై, పాట్నా, లక్నో, హైదరాబాద్ సహా పది రాష్ట్రాల్లోని 19 సైట్లలో ట్రయల్స్ నిర్వహించనున్నట్లు సంస్థ డీజీసీఐకి తెలిపింది. ప్రస్తుతం దేశంలో కోవ్యాక్సిన్తోపాటు జైడస్ కాడిల్లా, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు అదేవిధంగా రష్యాకు చెందిన స్పూత్నిక్ వి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి