ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)కి 2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష విషయంలో షాక్ తగిలింది. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్లో తప్పులున్నాయన్న అభ్యర్థుల వాదనతో ఏపీ హైకోర్టు ఏకీభవించింది. ఆ తప్పులను తొలగించి మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో నవంబర్ నుంచి జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి హైకోర్టును ఆదేశించింది. గ్రూప్-1 పరీక్షలో తప్పులున్నాయని కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఆ ప్రశ్నలను తొలగించకుండానే మెయిన్స్ పరీక్షను నిర్వహిస్తే తమకు నష్టం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పత్రంలో తప్పులు దొర్లడం వల్ల తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని కోర్టుకు వివరించారు. అభ్యర్థుల తరపున వాదించిన న్యాయవాది వాదనతో కోర్టు ఏకీభవించింది.