భారత్లో కరోనావైరస్ విలయతాండవం కొనసాగుతూనే ఉంది. గత కొన్నిరోజులుగా దేశంలో నిత్యం 70 వేలకుపైగా నమోదైన కేసులు.. కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టాయి. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. అయితే ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. దేశంలో కరోనా కేసులకన్నా.. రికవరీల సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. గత 24గంటల్లో గురువారం ( అక్టోబరు 15న ) దేశవ్యాప్తంగా కొత్తగా.. 63,371 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 895 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది.
తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 73,70,469 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,12,161 కి చేరింది. అయితే దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 64,53,780 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం దేశంలో 8,04,528 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 87.56 శాతం ఉండగా.. మరణాల రేటు 1.52 శాతం, యాక్టివ్ కేసుల రేటు 10.92 శాతం ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది.ఇదిలాఉంటే.. గురువారం దేశవ్యాప్తంగా 10,28,622 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో అక్టోబరు 15 వరకు మొత్తం 9,22,54,927 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది.