పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో రోహిత్ అనే యువకుడు హల్ చల్ చేశాడు. ప్రేమించిన యువతితో తనపై తప్పుడు కేసు పెట్టించారని సెల్టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. సుమారు 50 అడుగుల ఎత్తు ఎక్కేశాడు. తనపై తప్పుడు కేసు పెట్టిన ప్రియురాలు వస్తేనే దిగుతానని లేకపోతే ఆత్మహత్యకు పాల్పడతానని నిన్నటి నుంచి సెల్ టవర్ పైనే నిరసన వ్యక్తం చేస్తున్నాడు. వర్షం వస్తున్నా పట్టించుకోకుండా సెల్ టవర్ పైనే ఉండిపోయాడు. స్థానిక వైసీపీ నేత ప్రోద్బలంతో తనపై తప్పుడు కేసు పెట్టించారంటూ రోహిత్ ఆరోపించాడు.
బుధవారం ఉదయం ఇన్ఛార్జి సీఐ మల్లేశ్వరరావు, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మాట్లాడదాం కిందకు రావాలని రోహిత్ను పిలిచారు. ఈలోగా బంధువు వాటర్ బాటిల్ అందించేందుకు పైకి ఎక్కాడు. అటు రోహిత్ సైతం కిందకు దిగేందు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా తేనేతుట్టు కదిలింది. తేనెటీగలు దాడికి పాల్పడ్డాయి. దీంతో కింద ఉన్న పోలీసులు, మీడియా స్థానికులు పరుగులు తీశారు. అయితే తేనెటీగల దాడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి రోహిత్ కిందపడిపోయాడు.
తీవ్రంగా గాయపడ్డ అతడిని ఇన్చార్జ్ సిఐ వాహనంలో ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో రోహిత్ చికిత్సపొందుతున్నాడు. ఇకపోతే రోహిత్ పై హరిప్రియ అనే యువతి లైంగిక వేధింపుల కేసు పెట్టింది. యువతి ఫిర్యాదుతో నిందితుడుని పట్టుకునేందుకు కానిస్టేబుల్ వెళ్లాడు. అయితే అతడి బారి నుంచి తప్పించుకుని రోహిత్ సెల్ టవర్ ఎక్కాడు.