ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రకాశం జిల్లాలో దారుణం ...బావమరిదిని అడ్డుతప్పిస్తే అత్తింటి ఆస్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 03, 2020, 10:47 AM

ఐదుగురు ఆడపిల్లల మధ్య ఒక్కడే కొడుకు. అందరికీ పెళ్లిళ్లైపోయాయి. ఒక్కగానొక్క బావమరిది మంచీచెడూ చూసుకోవాల్సిన బావలు అతని ఆస్తిపై కన్నేశారు. పెళ్లి కూడా కాని బావమరిదిని అడ్డుతొలగిస్తే ఎంచక్కా ఆస్తి పంచుకోవచ్చని కుట్ర పన్నారు. పక్కా పథకం ప్రకారం సైనైడ్ కలిపి చంపేశారు. అందుకు తోడబుట్టిన అక్క కూడా సహకరించింది. తీరా పోలీసులు రంగంలోకి దిగడంతో కథ అడ్డం తిరిగింది. సొంతబావలే బావమరిదిని చంపేసినట్లు తేలడంతో కటకటాలపాలయ్యారు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.


కంభంకి చెందిన బి.వెంకటేశ్వర్లు, పద్మావతి దంపతులకు ఐదుగురు కుమార్తెలు రమాదేవి, లక్ష్మీ, చంద్రకళ, వసుంధర, సుకన్య.. ఒక కొడుకు మల్లికార్జున శివప్రసాద్(34) సంతానం. ఆడపిల్లలందరికీ వివాహాలు జరిపించారు. స్థానికంగా ఓ చెప్పుల దుకాణంలో పనిచేస్తున్న శివప్రసాద్‌కి ఇంకా పెళ్లి కాలేదు. ఆర్నెల్ల కిందట వెంకటేశ్వర్లు అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి శివప్రసాద్, అతని తల్లి పద్మావతి కలసి ఉంటున్నారు. మద్యానికి బానిసైన బావమరిదిని కూడా అడ్డుతప్పిస్తే అత్తింటి ఆస్తి కాజేయొచ్చని భావించిన బావలు దారుణానికి ఒడిగట్టారు.


 


పెద్దబావ రమేష్, తన తోడల్లుడు(3వ అల్లుడు) రాముడుతో కలసి పథకం రచించాడు. అందులో భాగంగా రమేష్ తన పెద్దమ్మ కొడుకైన రాముతో సైనైడ్ తెప్పించి తన భార్య చంద్రకళకి ఇచ్చాడు. పథకం ప్రకారం బావమరిది శివప్రసాద్‌కి బావ రాముడు ఫోన్ చేసి పార్టీ చేసుకుందామని పిలిచాడు. నలుగురూ కలసి మద్యం బాటిళ్లు, బిర్యానీ ప్యాకెట్లు తీసుకుని చెరువు వద్దకు వెళ్లారు. మద్యం తాగుతుండగా శివప్రసాద్‌కి ఫోన్ రావడంతో పక్కకి వెళ్లిన సమయంలో మద్యంలో సైనైడ్ కలిపేశారు. అది తాగి శివప్రసాద్ అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం ముగ్గురూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆస్తి కొట్టేసేందుకు సొంత బావలే అక్కతో కలసి బావమరిదిని హత్య చేసినట్లు తేలింది. నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు నిజాలు కక్కేసినట్లు తెలిసింది. నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com