ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ పై మండిపడ్డ చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 22, 2020, 04:14 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం నాడు టీడీపీ సీనియర్ నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలను నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ ఫేక్ పార్టీ, ఫ్రాడ్స్ పార్టీ, బ్లాక్ మెయిలింగ్‌లో, మ్యానిపులేషన్‌లో వైసీపీ నేతలు నిష్ణాతులు అని వ్యాఖ్యానించారు. ఓటు బ్యాంకు రాజకీయమే తప్ప, ఏ మతంపైనా జగన్‌కు విశ్వాసం లేదని ఆయన విమర్శించారు. ప్రశాంతమైన రాష్ట్రంలో మతచిచ్చు రగిలిస్తున్నారని.. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం రాష్ట్రాన్ని తగులపెడుతున్నారని బాబు ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం హిందూమతం స్వీకరించినట్లు డ్రామాలు ఆడి.. గెలిచాక బైబిల్ పక్కన పెట్టుకుని ప్రమాణ స్వీకారాలు చేశారన్నారు. ముఖ్యమంత్రి ఏ మతస్థుడైనా కావచ్చు కానీ అన్ని మతాలను సమదృష్టితో చూడాలని హితవు పలికారు. రాష్ట్రంలో అన్ని ప్రార్ధనా మందిరాలను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు.
'తెలుగుదేశం సెక్యులర్ పార్టీ. ఆలయాలపై దాడులను, మత విద్వేషాలను సహించదు. రాష్ట్రంలో ఇంతజరుగుతున్నా స్పందనలేని ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉన్నాడా..?. ఆలయాలపై దాడులపై నోరు తెరవరు, దళితులపై దాడులపై నోరు విప్పరు. బీసీలపై తప్పుడు కేసులను ఖండించరు.. గిరిజనులు, ముస్లింలపై దౌర్జన్యాలను అడ్డుకోరు. మంత్రుల వ్యాఖ్యలకు సాధువులు కంటతడి పెట్టే దుస్థితి తెచ్చారు. రాజధాని అమరావతి, ఫైబర్ గ్రిడ్‌పై వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. రూ770కోట్లు ఖర్చు చేసిన ఫైబర్ గ్రిడ్ లో రూ2వేల కోట్ల అవినీతి జరిగిందా..?. వైసీపీ అబద్దాలకు, తప్పుడు ప్రచారానికి ఇంకేం రుజువు కావాలి..?. టీడీపీపై కక్ష సాధింపే తప్ప రాష్ర్ప ప్రయోజనాలపై వైసీపీ ఎంపీలకు దృష్టి లేదు' అని బాబు ఆరోపించారు.
'సాక్ష్యాధారాలు ఉన్నా మంత్రి జయరామ్‌పై చర్యలు లేవు. అన్యాయంగా అచ్చెన్నాయుడిని 80రోజులు జైలుకు పంపారు. ప్రలోభాలు పెట్టి కొందర్ని లాక్కున్నంత మాత్రాన టీడీపీకి నష్టం ఏమీలేదు. ఒకరు పోతే వందమందిని తయారుచేసే సత్తా టీడీపీకి ఉంది. రాజీనామా చేయించిన తర్వాతే పార్టీలోకి తీసుకుంటామన్న జగన్ మాట ఏమైంది.?. అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి చెప్పిన మోరల్స్ ఏమయ్యాయి..?. నాపై గతంలో 26 విచారణలు చేయించారు.. 14సభా సంఘాలు, 3 ఉపసంఘాలు, 4జ్యుడిసియల్ ఎంక్వైరీలు, 1సీబీసీఐడీ విచారణ వేశారు. చివరికి ఏదీ రుజువు చేయలేక పోయారు. సమాజంలో ఎవరే తప్పు చేసినా కరెక్ట్ చేసేది న్యాయస్థానాలు. అలాంటి పవిత్ర న్యాయమూర్తులపై, కోర్టులపై వైసీపీ బురద జల్లడం హేయం. రైతుల పంపుసెట్లకు మీటర్ల ఏర్పాటును ప్రతిఘటించాలి. అన్ని ప్రాంతాల్లో రైతులకు టీడీపీ అండగా ఉండాలి' అని తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com