రైతులకు మేలు చేసేందుకు కొత్త వ్యవసాయ బిల్లులు తెచ్చామని కేంద్రం చెబుతుంటే.. ఈ బిల్లులు రైతులను నిలువునా ముంచుతాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.. లోక్సభతో పాటు రాజ్యసభలోనూ కొత్త వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందాయి.. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు పండించే వివిధ పంటల కనీస మద్దతు ధర - ఎంఎస్పీని పెంచుతూ కేంద్ర కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. 2021-22 రబీ సీజన్కు ఈ కొత్త కనీస మద్దతు ధర అమలు కానుంది. ఆరు పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది కేంద్ర ప్రభుత్వం. గోధుమలపై కనీస మద్దతు ధరను 50 రూపాయలు పెంచగా, శనగపప్పుపై రూ.225, ఎర్రపప్పుపై రూ.300, ఆవాలపై రూ.225, బార్లీపై రూ.75, కుసుమపై రూ.112 పెంచింది.
మరోవైపు... యూపీఏ హయాంలో ధరలతో తమ పాలనలో కనీస మద్దతు ధరను పోల్చుతూ ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్. యూపీఏ హయాంలో ఎర్ర పప్పు రూ.2,950 ఉంటే... ప్రస్తుతం 5,100 రూపాయలు ఇస్తున్నట్టు తెలిపారు. మినప పప్పు ధర రూ.4,300 నుంచి రూ.6 వేలకు పెరిగిందని, పెసర పప్పు ధర రూ.4,500 నుంచి రూ.7,196కు, కందులు రూ. 4,300 నుంచి 6 వేల రూపాయలకు, శనగలు రూ.3,100 నుంచి రూ.5,100కు.. ఆవాలు యూపీఏ హయాంలో 3,050 రూపాయలుంటే, తాము 4,650 రూపాయలు ఇస్తున్నామంటూ ట్వీట్ చేశారు ప్రకాశ్ జవదేకర్.