ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొడాలి నానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రఘురామకృష్ణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 21, 2020, 01:33 PM

ఏపీ రాష్ట్ర మంత్రి కొడాలి వేంకటేశ్వర రావు(నాని)కి ఎంపీ రఘురామకృష్ణరాజు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. విగ్రహాలు విరిగిపోతే ఏంటని మంత్రి కొడాలి అనడం సిగ్గుచేటని విమర్శించారు. కొడాలి వెనుక ఉన్న ఆ శక్తి ఎవరో... అందరికీ తెలుసని.. దీనిపై పెద్దగా బుర్రలు బద్ధలు కొట్టుకోనవసరం లేదని అన్నారు. ఆ శక్తికి చేతులు ఎత్తి మొక్కుతున్నానని వ్యాఖ్యానించారు. ‘‘కొడాలి వేంకటేశ్వర రావు, ఆయన వెనక ఉన్న అదృశ్య శక్తికి చెబుతున్నా... రాబోయే రోజుల్లో చెయ్యి విరగ్గొడితే చెయ్యి.. కాలు విరగ్గొడితే కాలు విరగ్గొడతారు ఖబడ్దార్’’ అని వ్యాఖ్యానించారు.   


ఢిల్లీలో రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన రఘురామరాజు ‘‘అయ్యా.. కొడాలి వేంకటేశ్వరరావు.. ఏం నష్టమని అంటున్నారు. దేవుడికి నష్టం కాదు. మాకు నష్టం. మనసులను గాయపరుస్తున్నారు. తగలబెట్టింది రథాలను కాదు.. భక్తుల మనోరథాలను, విరగొట్టింది విగ్రహాలను కాదు.. భక్తుల మనోభావాలను గాయపరిచారు. మతోన్మాదంతో చేస్తున్న ఈ గాయాలకు తగిన శిక్ష అనుభవించే రోజు వస్తుంది. నన్ను బహిష్కరించానని చెప్పుకొనే శక్తి లేని... నిస్సహాయ స్థితిలో మీరున్నారు. దేవాలయాలపై పార్లమెంట్‌లో మాట్లాడుతుంటే మీ సాటి కులస్థుడితో అల్లరి చేయిస్తారా? కులాన్ని కులంతో.. మతాన్ని మతంతో... అదే మతంలో అతి పవిత్రంగా తిరుమల ఆచారాలను పాటించే కేబినెట్ సహచరుడితో ఇలా నాపై విమర్శలు చేయించడం అత్యంత హేయమైన చర్య. మీరు ప్రవేశపెట్టిన పథకాలు... మీకు రివర్స్ వచ్చే పథకాలు చాలక... ఎక్కడా అప్పు పుట్టక స్వామి డబ్బుపై దృష్టి పెట్టారని ప్రజలు అనుకుంటున్నారు. టీటీడీలో ఇద్దరు అధికారులను మార్చాల్సిన అవసరం ఏంటన్న అనుమానాలు నెలకొన్నాయి.’’ 


హిందూవైన కొడాలి నాని కానీ, క్రిస్టియన్ అయిన జగన్ కానీ... ఎవరూ మక్కాలో అడుగుపెట్టలేరు. అది ముస్లింలకు పవిత్ర స్థలం. నాని.. మీరు మాట్లాడటం విచారకరం. మీరు మాట్లాడితే మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. దేవాలయాలపై దాడులు జరిగితే ఎవరికి నష్టం అంటున్నారు. మీ జేబుల్లోంచి డబ్బులు ఇవ్వడం లేదు కదా. నష్టం మాకు. రథం చేయంచుకుంటే ఎవరికి లాభం.. మీకు ఉండొచ్చు. వెండి పోతే కొనుక్కుంటారని చెబుతున్నారు. పోయింది వెండి కాదండి... అది అమ్మవారి వెండి. మీరు విగ్రహాన్ని రాయిగా చూస్తున్నారు. మా దృష్టిలో దేవుడు. పోయిన సొమ్ము అమ్మవారికి చెందినది. మీరు హిందూ అయ్యి ఉండి.. ఓ క్రిస్టియన్ సీఎం చేతిలో ఉండి ఇలా మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో గెలవాలంటే హిందూ మతం కావాలి. ఇంట్లో ఓ హిందూ దేవుడి ఫొటో ఉండదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఎవరెవరు చర్చిలకు వెళుతున్నారో రాష్ట్రపతికి రిపోర్టు ఇచ్చాను. త్వరలో వివరాలు తెలుస్తాయి. హిందువులు అంటే శాంతస్వభావులు. పెద్దగా తిరగబడరు. మా స్వభావం అలాగే ఉంటుంది. ఆ అదృశ్యశక్తికి చెబుతున్నా.. మా మతం జోలికి రాకండి. భరతమాత ముద్దుబిడ్డ ఇక్కడే మా వెనక ఉన్నారు. గౌరవించకపోయినా ఫర్వాలేదు. అవమానించకండి. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి పెద్దలు మాడభూషి శ్రీధర్ ఓ లేఖ రాశారు. అది చదివితే అన్నీ తెలుస్తాయి. ఇక దేవుడి సొమ్మును కొట్టేసినోడు బాగుపడినట్టు ఈ ప్రపంచంలో లేదు. మేము మీ దేవుణ్ణి గౌరవిస్తాం. మీరు మా దేవుణ్ణి గౌరవించండి’’ అని వ్యాఖ్యానించారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com