సచివాలయ ఉద్యోగ పరీక్షా కేంద్రాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం తనిఖీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 9,37, 376 మంది పరీక్షలు రాస్తున్నారని... ఇవాళ ఒక్క రోజే 6,09,026 మంది పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. కోవిడ్ దృష్ట్యా అనేక చర్యలు తీసుకున్నామన్నారు. ఏ రాష్ట్రంలో కూడా గ్రామ సచివాలయాలు లేవని.. ఇది సీఎం ఆలోచన అని చెప్పారు. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత ఏపీ ప్రభుత్వానిదే అని మంత్రి తెలిపారు. గ్రామ, వార్డు స్థాయిలో ప్రజలకు సంక్షేమ పధకాలు సక్రమంగా అందాలనే వాలంటీర్, సచివాలయ సిబ్బంది నియామకం చేపడుతున్నామని అన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాలకు నూతన భవనాలను నిర్మిస్తున్నామని.. .మార్చిలోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అంగన్ వాడీ, వైద్య కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్మిస్తున్నామన్నారు. అన్ని శాఖలను గ్రామంలోనే అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. గతంలో అనేక పరీక్షల్లో పేపర్లు లీక్ అయ్యాయని.. కానీ ప్రభుత్వం తీసుకున్న పకడ్బందీ చర్యలతో కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నామన్నారు.
అలాగే శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పణపై మంత్రి స్పందిస్తూ... గతంలో వైఎస్ కూడా పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదని.. ఆయన తనయుడు సీయం జగన్ ఇవ్వాల్సిన అవసరం లేదని టిటిడి చైర్మన్ స్పష్టంగా తెలిపారన్నారు. దాన్ని వివాదం చేయాల్సిన అవసరం లేదని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.