విశాఖపట్టణం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేసే వారికి రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. ప్రలోభాలకు లోనై పార్టీకి ద్రోహం చేయడం దారుణమన్నారు. సొంత లాభం కోసం పార్టీకి ద్రోహం తలపెడితే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఇకపోతే శనివారం టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ సీఎం జగన్ ను కలిశారు. వాసుపల్లి గణేష్ తనయులు సాకేత్..సూర్యలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా జగన్ పై ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ప్రశంసలు కురిపించారు. జగన్ గట్స్ ఉన్న నేత అంటూ కొనియాడారు. జగన్ సహకారంతో ఇకపై నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని చెప్పుకొచ్చారు. ఈ అంశంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. టీడీపీ నుంచి గెలుపొంది ఇతర పార్టీలోకి వెళ్లాలనుకునే ద్రోహులకు పార్టీలో స్థానం లేదని చెప్పుకొచ్చారు. నాయకులు వస్తారు, పోతారని కానీ కార్యకర్తలే శాశ్వతమన్నారు. ఒకరిద్దరు పార్టీని వీడినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు కొండంత అండగా నిలుస్తారని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.