జలుబును కరోనా వైరస్ లక్షణంగా భావించి చాలా మంది ఆందోళనకు గురవుతున్న వేళ వైద్య నిపుణులు కీలక విషయం చెప్పారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం మేరకు..పిల్లల్లో ముక్కు విపరీతంగా కారుతుండటాన్ని చూసి అది కరోనా వైరస్ లక్షణంగా భావించవద్దని సూచించారు. కరోనా కారణంగా వచ్చే జలుబుకు ముక్కు కారడం ఉండదని, ముక్కు దిబ్బడేసినట్లుగా ఉంటుందని వివరించారు. జలుబు చేస్తే ముక్కు కారడం ఓ సాధారణ లక్షణమని, దాన్ని కరోనా లక్షణంగా అపోహపడొద్దని తెలిపారు. అంతేకాదు.. ముక్కు కారడం సమస్య ఉన్న చిన్నారుల్లో కరోనా వైరస్ కచ్చితంగా లేనట్లేనని, అలాంటి వారు నిశ్చింతగా సాధారణ జలుబుకు సంబంధించి చికిత్స తీసుకోవచ్చని ప్రొఫెసర్ టిమ్ స్పెక్టర్ తెలిపారు. డైలీ మెయిల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వివరాలు తెలిపారు.
కొవిడ్-19 మహమ్మారికి సంబంధించిన లక్షణాలపై తల్లిదండ్రులు తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలని లండన్లో కింగ్స్ కాలేజ్ ప్రొఫెసర్ టిమ్ స్పెక్టర్ సూచించారు. పిల్లల్లో ముక్కుకారడంతో పాటు ఇతర లక్షణాలు ఉంటేనే పరీక్షలు చేయించాలని సూచించారు. కరోనా మహమ్మారి కారణంగా వైద్య పరీక్షలు చేయడం ఒక సవాల్ మారిందని ప్రొఫెసర్ టిమ్ స్పెక్టర్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ జలుబు ఏదో, కరోనా లక్షణం ఏదో గుర్తించి అవసరమైనవారు మాత్రమే పరీక్షలు చేయించుకోవాలని టిమ్ స్పెక్టర్ తెలిపారు. యూకేలో ఇటీవలే పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో చాలామంది చిన్నారుల తల్లిదండ్రులు కరోనా విషయంలో ఆందోళన చెందుతున్నారు. అలాంటి తల్లిదండ్రుల్లో అపోహలను తొలగించడం కోసం వైద్య నిపుణులు.. వివిధ మార్గాల ద్వారా కరోనా లక్షణాల గురించి అవగాహన కల్పిస్తున్నారు.