ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాహనదారులకు ఏపీ సర్కార్ షాక్.. పెట్రోల్, డీజిల్‌పై మరో పన్ను

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 18, 2020, 08:27 PM

ఆంధ్రప్రదేశ్‌లో వాహనదారులకు ప్రభుత్వం షాకిచ్చింది. రెండు నెలలు తిరక్కుండానే పెట్రోలు, డీజిల్‌పై మరోసారి కొత్త పన్నును విధించింది. పెట్రోల్, హై స్పీడ్ డీజిల్‌పై ప్రతి లీటర్‌కు ఒక్క రూపాయి చొప్పున సెస్ విధిస్తూ ఏపీ సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇప్పటికే ఉన్న వ్యాట్‌కు అదనంగా ఈ రెండు ఉత్పత్తులపై రూపాయి చొప్పున సెస్ విధిస్తున్నట్లు వెల్లడించింది. డీలర్ వద్ద నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేయాలని ప్రభుత్వం ఆర్డినెన్స్‌లో పేర్కొంది. రహదారి అభివృద్ధి నిధి కోసం ఈ సెస్ వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సెస్ ద్వారా రూ. 600 కోట్ల మేర ఆదాయం వస్తుందని సర్కారు అంచనా వేస్తుంది. ఈ అదనపు ఆదాయాన్ని రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.ఈ అదనపు ఆదాయంతో రాష్ట్రంలో రోడ్లు అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 3న జరిగిన కేబినెట్‌ సమావేశంలోనే దీనికి ఆమోదముద్ర వేసింది. అయితే వరుసగా పెంచుతున్న పన్నుల వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని భావించి గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. అయితే ఎట్టకేలకు దీనిపై అధికారికంగా శుక్రవారం జీవో విడుదల చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com