ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని ఆర్భాటంగా ప్రకటిస్తున్న వైసీపీ ప్రభుత్వం దొంగచాటున పన్నుల మోత మోగిస్తూ ప్రజలపై భారాలు మోపేందుకు సమాయత్తం కావడం హేమమైన చర్య అని, ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ నగర కార్యదర్శి ఎమ్ పైడిరాజు డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ పై సెస్ విధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా పైడిరాజు మాట్లాడుతూ రెండు నెలలు తిరక్కుండానే పెట్రోలు, డీజిల్పై మరోసారి కొత్త పన్నును తెరపైకి తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన ఖండించారు. రాష్ట్రంలో రోడ్లను అభివృద్ధి చేయాలనే సాకుతో పెట్రోలు, డీజిల్పై రూపాయి చొప్పున సెస్ విధించాలని ఈ నెల 3న జరిగిన కేబినెట్ సమావేశంలోనే దీనికి ఆమోదముద్ర వేసిందని, అయితే వరుసగా పెంచుతున్న పన్నుల వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని భావించి గోప్యంగా ఉంచిందని పేర్కొంటూ మరి కొద్ది రోజుల్లోనే దీనిపై అధికారికంగా జీవో విడుదల చేయదానికి ప్రభుత్వం సమాయత్తం కావడాన్ని ఆయన వ్యతిరేకించారు.‘రోడ్ డెవల్పమెంట్ సెస్’ పేరుతో ఏటా రూ.600 కోట్లు ఆదాయం సమకూర్చుకోవలన్న ప్రభుత్వ ఆలోచన చూస్తుంటే ఓపక్క సంక్షేమం అంటూనే మరోపక్క ప్రజలపై భారాలు వేయడం చూస్తే ప్రజల పట్ల ఈ ప్రభుత్వం కు ఉన్న చిత్త శుద్ధి తేటతెల్లమైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పెంచిన పన్నులు చూసేందుకు రూపాయలు, పైసల్లో కనిపిస్తున్నా ఏటా వాహదారుల నుంచి అక్షరాలా రూ.1,200 కోట్లు లాగేస్తోంది. జూలైలో పెంచిన అదనపు వ్యాట్ వల్ల రూ.600 కోట్లు, తాజా సెస్తో మరో రూ.600 కోట్లు సమకూరనున్నాయి. పైగా తాజాగా విధించే రోడ్ డెవల్పమెంట్ సెస్ శాశ్వతంగా ఉంటుంది కాబట్టి వాహనదారులు ఎప్పటికీ దీన్ని భరించక తప్పదని పేర్కొంటూ దీని ప్రభావం సరుకు రవాణాపైనా పడి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందన్నారు.కార్యక్రమంలో సీపీఐ నగర సహాయ కార్యదర్శి ఎస్ కె రెహమాన్, కార్యవర్గ సభ్యులు వామనమూర్తి,ఈశ్వరరావు, చంద్రశేఖర్,రాంబాబు, నాయకులు మన్మధరావు,దేవుడమ్మ, జయ, రవి, లక్ష్మణరావు, రాజాక్,టి వి రావు, చిరంజీవి,తిరుపతిరావు, నల్లయ్య,ఎం.శ్రీనివాస్,కాసుబాబు,వెంకటేశ్వరరావు,పలువురు పార్టీ ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.