మంగళగిరి పట్టణంలోని 29వ వార్డు టిప్పర్ల బజార్ షాదీఖానాలో స్లమ్ సమైక్య డ్వాక్రా గ్రూప్ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం డ్వాక్రా గ్రూప్ సంఘాల ఆత్మీయ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కౌన్సిలర్ షేక్ మహమ్మద్ రఫీ, వైసీపీ నాయకులు షేక్ సుభాని హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా లబ్ధి పొందిన డ్వాక్రా గ్రూపు మహిళలు దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్కె చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మహమ్మద్ రఫీ ద్వారా డ్వాక్రా మహిళలకు రుణ మంజూరు పత్రాలు పంపిణీ చేశారుఅనంతరం మహమ్మద్ రఫీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో డ్వాక్రా మహిళలకు డ్వాక్రా రుణాలను నాలుగు దఫాలుగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, దానిలో భాగంగా తొలి విడతగా రూ.6,794 కోట్లు విడుదల చేశారని, దీనివల్ల 11 కోట్ల 23 లక్షల మంది మహిళలకు లబ్ధి పొందుతున్నారని, అదే విధంగా రూ.1,400 కోట్లు సున్నా వడ్డీ పథకం అమలుకు విడుదల చేశారన్నారు. డ్వాక్రా గ్రూప్ మహిళలు అందరూ ఐక్యమత్యంగా ఉండి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పిలు షేక్ అహ్మద్ ఉన్నీషా, కరిమున్నీశా, చింతా లక్ష్మి కుమారి తదితరులు పాల్గొన్నారు.