వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్ సర్కార్కు రాజ్యాంగం అంటే గౌరవం లేదంటూ విరుచుకుపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చే హక్కు శాసనసభకు లేదన్న కనీస అవగాహన కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. న్యాయవ్యవస్థ వల్లే ప్రజలు అన్యాయం బారిన పడకుండా బతుకుతున్నారన్నారు. ఇప్పటికైనా న్యాయ వ్యవస్థలను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. రాజధాని భూముల అంశంపై సీబీఐ విచారణ జరపాలని ధర్నా చేశారు కానీ అంతర్వేది ప్లకార్డు, ప్రత్యేక హోదా కోసం ప్లకార్డు ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ నిర్ణయాలపై మంత్రివర్గ ఉపసంఘం వేయడం హాస్యాస్పదమని మంత్రివర్గ ఉపసంఘం తర్వాత సిట్ ఏర్పాటు చెస్తే దానిపై కోర్టు స్టే ఇచ్చిందని గుర్తు చేశారు. మన ప్రభుత్వం కూడా భవిష్యత్లో మాజీ ప్రభుత్వం అవుతుందని.. గత ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ సమీక్షించుకుంటూ పోతే ఎలా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. తనపై చెయ్యి వేస్తే రక్షణ ఇచ్చేదుకు రాజా భయ్యా లాంటి వారు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారంటూ రఘురామరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గానికే కాదు.. పులివెందులకు కూడా వెళ్తానని సవాల్ చేశారు. కరోనా తగ్గాక పులివెందులలో 10 వేల మందితో సభ పెడతానని తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు.