అన్న ప్రేమ తమ్ముడి చావుకొచ్చింది. బంధువుల అమ్మాయితో అన్న పారిపోవడంతో పోలీసులు తమ్ముడిని తీసుకెళ్లి కొట్టారని, అందుకే అతను చనిపోయాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. లాకప్లో కొట్టి చంపేసి చెట్టుకు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇంతకీ అది హత్యా? ఆత్మహత్యా? తేలాల్సి ఉంది. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమిళనాడులో ఈ దారుణం చోటుచేసుకుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం మేరకు.. మదురై జిల్లా ఆనైకరై గ్రామానికి చెందిన ఇదయకని అనే యువకుడు బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. మైనర్ బాలికను తీసుకుని గత నెల 23న ఇంటి నుంచి పారిపోయాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా ఇదయకని తల్లి పాండియమ్మాళ్, తమ్ముళ్లు రమేష్, సంతోష్లను పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పారు.అనూహ్యంగా రమేష్ ఊరి బయట ఓ చెట్టుకు ఉరి వేసుకుని శవమై తేలాడు. సాయంత్రం 7 గంటల సమయంలో రమేష్ని పోలీసులు స్టేషన్కి తీసుకెళ్లి చావబాదారని.. పోలీసు దెబ్బలు తాళలేక రమేష్ ప్రాణాలు కోల్పోయాడని మృతుడి బంధువులు ఆరోపించారు. పోలీసులు రమేష్ని లాకప్డెత్ చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారంటూ గ్రామంలో ఆందోళనకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించే వరకూ శవాన్ని చెట్టు నుంచి దించేది లేదని బంధువులు భీష్మించారు. విషయం తెలుసుకున్న మదురై ఎస్పీ సుజిత్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఆయన సర్దిచెప్పడంతో కుటుంబ సభ్యులు శాంతించారు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.