రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక హిందూ మతాన్ని టార్గెట్ చేసిందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ప్రభుత్వ అండతోనే అనేక దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. శుక్రవారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. దేవాలయాల ఆస్తుల అమ్మకం, అన్యమతస్తుల ప్రమేయం ఎక్కువైందని వ్యాఖ్యానించారు. ఏపీలో మతమార్పిడులు యధేచ్చగా జరుగుతున్నాయని కన్నా ధ్వజమెత్తారు. గతంలో మత మార్పిడికి అభ్యంతరం చెబితే వెళ్లిపోయేవారని, కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక మత మార్పిడులు చేసే వారు రెచ్చిపోతున్నారని అన్నారు. హిందూ మతాన్ని అంతం చేసే కుట్ర రాష్ట్రంలో జరుగుతోందన్నారు. చర్చి మీద రాళ్లు వేశారని 41 మందిని సెలెక్ట్ చేసి మరీ నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారని, అదే అంతర్వేది రథం తగలబెడితే ఇప్పటికీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని దుయ్యబట్టారు. శ్రీశైలంలో అన్యమతస్తుల ప్రమేయంపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. గత ప్రభుత్వం కంటే ఎక్కువగా వైసీపీ ప్రభుత్వం పోలీసులను వాడుకుంటోందని కన్నా విమర్శించారు.