స్థానిక తుమ్మలావ సాయిబాబా ఆలయం వద్ద అన్ని మతాలను కాపాడాలంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు పూజలు నిర్వహించారు. హిందూ దేవాలయాలు, ధార్మిక సంస్థలపై దాడులకు వ్యతిరేకంగా నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కాశి నవీన్ కుమార్, ఉమా మార్కండేయ స్వామి ఆలయం చైర్మన్ మజ్జి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడటంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని వర్గాల వారిని కాపాడుకోవాల్సిన భాద్యత ప్రభుత్వం మీద ఉందని, అదే నిజమైన ప్రజాస్వామ్యం అని అన్నారు. వైస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన్నపటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయలపై, ధార్మిక సంస్థలపై దాడులు జరుగుతున్నా వాటిని అరికట్టడంలో వైస్సార్సీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
విజయవాడలో ఎంతో ప్రతిష్టాత్మక దేవాలయం దుర్గ గుడి ఊరేగింపు రథానికి ఉండవలసిన నాలుగు వెండి సింహాలలో మూడు సింహాలు, ఒక సింహం కాలు దొంగిలించిన సంఘటన వెలుగులోనికి వచ్చిందని, ప్రజలు అడిగితేనే గాని ఆలయ అధికారులు స్పందించలేని పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. అదే విధంగా రాష్ట్రంలో దళితుల మీద దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, ఇవి రాష్ట్రంలో నిత్యకృత్యాలుగా మారిపోయాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితులను నివారించవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనని సూచించారు. ఈ కార్యక్రమంలో హితకారిణి సమాజం ఛైర్మన్ యాళ్ల ప్రదీప్, నాయకులు ఉప్పులూరి జానకీ రామయ్య, తంగేళ్ళ బాబీ, బుడ్డిగ రవి, కరగాని వేణు, యాళ్ల రవికుమార్, పులి శ్రీనివాస్ రెడ్డి, బివి శివా రెడ్డి, గొంగడా తులసి రామ్, చాపల నాగరాజు, ఏ రమేష్, నాగు, నాని, కోనా అప్పారావు తదితరులు పాల్గొన్నారు.