అమరావతి: వైసిపి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దుర్గ గుడి రథాన్ని వినియోగించలేదని, రథంపై సింహాలు గత ప్రభుత్వ హయాంలోనే మాయమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు ఎపి దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్… రథం వెండి సింహలు మాయం కావడంపై ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ, దుర్గగుడిలోని రథానికి భద్రత కల్పించే చర్యల్లో భాగంగా అధికారులు కార్పెట్ని తెరిచి చూసే సమయంలో సింహాలు కనిపించలేదని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రథాన్ని ఉపయోగించలేదన్నారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిందో…లేక ఇప్పుడు జరిగిందో విచారణలో తేలుతుందని ఆయన చెప్పారు. ఘటనపై దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని తెలియజేశారు. సెక్యూరిటీ ఏజెన్సీకి దేవాలయం భద్రత అప్పగించామని, ఈ విషయంలో సెక్యూరిటీ ఏజెన్సీ భద్రతాలోపం అని తేలితే దానిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. అంతర్వేది ఘటన తరువాత అన్ని దేవాలయాల్లో భద్రతా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.