పబ్జి ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న మాట ఇది ఒకటే. దేశ రక్షణ దృశ్య కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఎంతో ఆదరణ కలిగిన పబ్జి గేమ్ ను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకొని ఎంతో మంది గుండెలు పగిలేలా చేసిన విషయం తెలిసిందే. ఎందుకంటే భారతదేశంలో పబ్జి కి అలవాటు పడిన వారు... వేలల్లో లక్షల్లోనో లేరు... ఏకంగా కోట్లలో ఉన్నారు. కొంతమంది అయితే పబ్జి కి బానిసలుగా మారిపోయి వారు కూడా ఉన్నారు. గంటలకు గంటలు పబ్జి గేమ్ ఆడుతూ ప్రతిరోజు సమయం గడిపే వారు ఒక్కసారిగా పబ్జి బ్యాన్ కావడంతో దిక్కుతోచని స్థితిలో అయోమయంలో పడిపోయారు. దీంతో ఎంతో మంది మనస్తాపం చెందుతున్నారు.
ఇక పబ్జి కి మరీ ఎక్కువగా అలవాటు పడిపోయిన కొంతమంది అయితే చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం కూడా చేస్తున్నారు. ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది ఇక్కడ. పబ్జి గేమ్ కు బానిస అయిన బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలాడు. అనంతపురంలో ఈ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని రెవెన్యూ కాలనీకి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి... చెన్నైలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే పబ్జి గేమ్ కి ఎంతగానో అలవాటు పడ్డాడు కిరణ్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం లాక్ డౌన్ సమయం కావడంతో దొరికిన ఖాళీ సమయం మొత్తం పబ్జి గేమ్ పైనే పెట్టాడు.
దీంతో క్రమక్రమంగా పబ్జి గేమ్ కి బానిస గా మారిపోయాడు. రాత్రి పగలు అనే తేడా లేకుండా పబ్జి గేమ్ లో మునిగి తేలాడు. ఇటీవల కేంద్రం పబ్జి బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇలా క్రమక్రమంగా కుంగిపోయి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు విగతజీవిగా మారిపోవడంతో ఆ తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది. దీంతో తల్లిదండ్రులు బోరున విలపించారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.