కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ను పరిశీలిస్తున్న టీడీపీ నేతల బృందంపై మైనింగ్ మాఫియా దాడి చేసిందని ఆ పార్టీ నేత దేవినేని ఉమా మహేశ్వర రావు మండిపడ్డారు. వైసీపీ గూండాలు ఇష్టం వచ్చినట్లు దాడులకు పాల్పడుతున్నారంటూ ఆయన ఆరోపణలు గుప్పించారు.
'అప్పట్లో నందిగామలో శాండ్ మాఫియాను ప్రశ్నించిన విలేకరి గంటానవీన్ ను హత్యచేశారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ను పరిశీలిస్తున్న టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ బృందం, సజ్జాఅజయ్ పై మైనింగ్ మాఫియా దాడి చేసింది. పంచభూతాలను సైతం మింగేస్తున్నారని చంద్రబాబు నాయుడు చెప్పారు. మీ ప్రజాప్రతినిధి దోపిడీ, దౌర్జన్యాలపై ఏం చర్యలుతీసుకుంటారు వైఎస్ జగన్' అని దేవినేని ఉమ ప్రశ్నించారు. కాగా, ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన ఓ వీడియోలో చూపించారు.
అక్రమ మైనింగ్పై సోషల్ మీడియాలో స్పందిస్తున్నారంటూ ఓ టీడీపీ నేతపై వైసీపీ కార్యకర్తలు దాడిచేసి కొట్టారని అందులో ఉంది. నిన్న కృష్ణాజిల్లా కొండపల్లి రిజర్వు ఫారెస్టు అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్లి టీడీపీ నేతలు ఇబ్రహీంపట్నంలో మధ్యాహ్నం ఓ హోటల్లో భోజనం చేసేందుకు ఆగారని ఇంతలో కొందరు అక్కడకు వచ్చారని అందులో పేర్కొన్నారు. వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ చూస్తుండగానే టీడీపీ నేతలపై కొందరు దుర్భాషలాడుతూ, ముష్టిఘాతాలు కురిపించారని అందులో పేర్కొన్నారు. ఈ దాడిలో నందిగామ జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి సజ్జా అజయ్ తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు.