తమ భూ సమస్య పరిష్కరించాలని మండల తహాశీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. తమ సమస్య పరిష్కరించాలని మెురపెట్టుకున్నారు. అయినా కరుణించలేదు. అక్కడ న్యాయం జరగకపోవడంతో కలెక్టరేట్ కూడా వెళ్లారు. అక్కడా న్యాయం జరగకపోవడంతో అక్కడే పురుగుల మందు తాగి రైతులు ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. తెలంగాణలో సమగ్ర భూ సర్వే చేసి కొత్త పాస్ పుస్తకాలు జారీ చేశారు. ఆ సమయంలో చాలా మంది సమస్యలు పరిష్కారం కాలేదు.ఇప్పటికీ పాస్ పుస్తకాలు రాక ఎంతో మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అందించే రైతు బంధు సాయానికి కూడా నోచుకోవడం లేదు. అలా దామరగిద్ద మండలం క్యాతనపల్లి గ్రామానికి చెందిన రైతులు కూడా రైతు బంధు సాయానికి నోచుకోవడం లేదు. తమ భూ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఎంతబ్రితిమిలాడిన పరిష్కరించడం లేదు. దాంతో ఆ రైతులు కలెక్టరేట్ లో పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారిద్దరూ తండ్రీ కొడుకులుగా విచారణలో తేలింది.