అనంతపురం జిల్లా హిందూపురంలో మద్యం మాఫియా రెచ్చిపోతోంది. కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తెచ్చి విక్రయిస్తున్నారన్న సమాచారంతో తనిఖీకి వెళ్లిన ఎక్సైజ్ మహిళా ఎస్సైపై మద్యం మాఫియా దాడికి పాల్పడింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఎస్సైతో పాటు సిబ్బందికి గాయాలయ్యాయి.
స్థానిక బోయపేటలో అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తున్నారంటూ ఎక్సైజ్ ఎస్సై సరోజాదేవికి సమాచారం అందింది. ఆమె తన సిబ్బందితో కలిసి శుక్రవారం రాత్రి తనిఖీకి వెళ్లారు. అయితే బోయపేటకు చెందిన రౌడీ షీటర్ లక్ష్మి నారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి ఎక్సైజ్ పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. రాళ్లు, కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ దాడిలో ఎస్సై సరోజాదేవి, కానిస్టేబుల్ భక్తర్ వలీకి గాయాలయ్యాయి. ఎస్సై సరోజ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఘటనపై ఎక్సైజ్ పోలీసులు టూటౌన్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. టూ టౌన్ సీఐ మన్సూర్ ఉద్దీన్ తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకుని, బాధితులను చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకుల అండదండలతోనే అక్రమ మద్యం విక్రయాలు చేస్తున్నారని సమాచారం.