ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏపీలో 3.82 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు 30వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి జీవితాలను తారుమారు చేస్తున్నది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇటీవల ఓ హృదయవిదారకమైన సంఘటన జరిగింది.
తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు ఇటీవలే కరోనా టెస్టులు చేయించుకున్నారు. కుమారుడికి పాజిటివ్ రాగ, తండ్రికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో కుమారుడిని తాడేపల్లిగూడెంలోని కోవిడ్ కేర్ సెంటర్ కు తరలించారు. దీంతో ఆ తండ్రి ఆందోళన చెందాడు. తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ సమయంలో మతిస్థిమితం కోల్పోయాడు. బట్టలు చింపేసుకొని తనలో తాను మాట్లాడుకుంటూ తిరుగుతున్నాడు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించడంతో అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన ఇప్పుడు గోదావరి జిల్లాలో వైరల్ గా మారింది.