గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. రాజమండ్రి వద్ద అఖండ గోదావరి సముద్రంలా మారింది. లంకలన్నీ మునిగిపోయాయి. ఎగువ భాగంలో అన్ని నదులూ పొంగడంతో పాటు, వర్షాలు పడుతుండడం వల్ల పెద్ద వరదే వస్తోంది. దీంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ వద్ద 17.75 అడుగులకు నీటి మట్టం పెరిగింది. 175 గేట్లు పూర్తిగాఎత్తివేత 19 లక్షలు క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రతీ గంటకూ వేల క్యూసెక్కుల ప్రవాహం పెరుగుతోంది. 2013 తర్వాత ఇదే పెద్ద వరద. రాజమండ్రిలోని ఘాట్లు, ఇసుక ర్యాంపులు నిండా మునిగాయి. డ్రెడ్జింగ్ మిషన్లు, పడవలు ర్యాంపుల్లోనే ఉండిపోయాయి. కాఫర్ డ్యామ్ వద్ద అధికంగా వరద నీరు ఉండడం వల్ల ధవళేశ్వరం బ్యారేజీకి కాస్త ఒత్తిడి తగ్గినట్టు చెప్తున్నారు.