మంచి రహదారులు ఆ ప్రాంత అభివృద్ధికి చిహ్నాలు. హైవేలు అధికంగా ఉన్న ప్రాంతాలకు రవాణా సదుపాయం అధికంగా ఉండి అభివృద్ధి చెందుతాయి. మన దేశంలో రవాణా రంగానికి మరింత ఊతం ఇవ్వడం కోసం.. కీలక నగరాల నడుమ హైవేల నిర్మాణానికి నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) నూతన హైవేల నిర్మాణానికి చర్యలు చేపట్టింది.23 కొత్త హైవేల నిర్మాణానికి హైవేస్ అథారిటీ డెడ్ లైన్ విధించింది. 2025 మార్చి 25లోగా ఈ హైవేలను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ-ముంబై, అహ్మదాబాద్-ధోలెరా, అమృత్సర్-జామ్నగర్ ఎక్స్ప్రెస్ వేలు 2023 మార్చిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరో 9 హైవేలను 2024 మార్చిలోగా పూర్తి చేస్తారు. మిగతా 9 గ్రీన్ ఫీల్డ్ హైవేలు మార్చి 2025 నాటికి పూర్తి కానున్నాయి. ఈ 23 హైవేల పొడవు 7800 కిలోమీటర్లు. వీటి నిర్మాణానికి రూ.3.3 లక్షల కోట్లు అవసరం కానున్నాయి.ఈ హైవేలు హైదరాబాద్, వైజాగ్, విజయవాడల మీదుగానూ వెళ్లనున్నాయి. నూతన హైవేల నిర్మాణం వల్ల తెలంగాణకు భారీగా లాభం చేకూరనుంది. 23 హైవేల్లో 3 హైదరాబాద్ నగరంతో కలుపుతూ ఉండడం విశేషం. హైదరాబాద్ నుంచి భద్రాచలం మీదుగా విశాఖపట్నానికి ఒక హైవేను నిర్మించనున్నారు. ఇందుకోసం 221 కి.మీ. మేర కొత్తగా హైవే నిర్మిస్తారు. 2025 మార్చి నాటికి దీని నిర్మాణం పూర్తి కావాలని లక్ష్యంగా నిర్ణయించారు. హైదరాబాద్-రాయ్పూర్ మధ్య మరో హైవేను నిర్మిస్తారు. దీని పొడవు 330 కి.మీ. ఇండోర్, హైదరాబాద్ నగరాల మధ్య 713 కి.మీ. పొడవైన హైవేను నిర్మించనున్నారు. ఇది ఇలా ఉంటే రాయ్పూర్-విశాఖ నగరాల మధ్య 464 కి.మీ. పొడవైన హైవేను నిర్మించనున్నారు.తెలంగాణను తాకుతూ.. భద్రాచలం మీదుగా నాగ్పూర్, విజయవాడ నగరాల మధ్య 457 కి.మీ. పొడవైన హైవేను నిర్మిస్తారు. సోలాపూర్-కర్నూలు నగరాల మధ్య నిర్మించనున్న హైవే కూడా తెలంగాణ మీదుగా వెళ్లనుంది. ఇక దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే.. 281 కి.మీ. మేర బెంగళూరు శాటిలైట్ రింగ్ రోడ్డును 2024 మార్చి నాటికి నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బెంగళూరు-చెన్నై, చెన్నై-సేలం నగరాల మధ్య హైవే నిర్మించనున్నారు.