ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోటెత్తుతున్న వరద.. ఉరకలేస్తున్న గోదావరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 15, 2020, 06:19 PM

రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ ఫ్లో 9.84లక్షల క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నియోజకవర్గంలోని చాకలిపాలెం వద్ద కాజ్‌వే పూర్తిగా మునిగిపోవడంతో కనకాయలంక, బూరుగులంక, అరికెలవారిపేట, జి.పెదపూడి సహా పలు లంకగ్రామాలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. గోదావరి ఉద్ధృతికి దేవీపట్నం సమీపంలో గండిపోచమ్మ ఆలయంలోకి వరదనీరు వచ్చి చేరింది.రహదారులపై వరదనీరు ప్రవహిస్తుండటంతో దేవీపట్నం మండలంలోని 36 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు చేర్చుతున్నారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో తాగునీటి కోసం ముంపు గ్రామాల్లోని ప్రజలు అవస్థలు పడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి ఉరకలేస్తోంది. ఎగువున భారీ వర్షాలు కురవడంతో నదిలో వరద ప్రవాహం పరుగులు పెడుతోంది. కొత్తూరు కాజ్‌వే వద్ద పది అడుగుల మేర వరదనీరు చేరుకోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.


భద్రాచలం వద్ద ..


ఇది ఇలా ఉంటే పరివాహక ప్రాంతాలు, ఉపనదుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో భద్రాచలం వద్ద నీటి మట్టం 45 అడుగులకు చేరింది. నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఇప్పటికే అమలులో ఉందన్నారు. నేటి మధ్యాహ్న సమయానికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com