చంద్రుని అందాన్ని చూసి భలే ఉంది అంటూ ఆనందించడమే కాదు.. అక్కడ జీవించే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రస్తుత పరిశోధనలను పరిశీలిస్తే అర్థమవుతోంది. చంద్రుడిపై నిర్మాణాలను చేపట్టడానికి వీలుగా ఉండే ఇటుకలను ఇస్రో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగుళూరు సంయుక్తంగా రూపొందించాయి. ఈ ఇటుకల తయారీలో చంద్రుని మీద నుంచి తెచ్చిన మట్టి, కొన్ని రకాల బ్యాక్టీరియాలు, చిక్కుడు కాయల గుజ్జు వినియోగిస్తున్నారు. ఇందులో ఉన్న బ్యాక్టీరియా జీవక్రియలో భాగంగా ఇటుకకు ఎక్కువ మన్నిక లభించేలా చేసే కొన్ని పదార్ధాలను విడుదల చేస్తాయి. ఇవి యూరియాతో చర్యలు జరిపి కాల్షియం కార్భైడ్ లాంటి పదార్ధాల తయారీలో ఉపయోగపడతాయి.అందుకే ఈ ఇటుకల తయారీలో మూత్రం ద్వారా తయారయ్యే యూరియాను కూడా వాడుతారు. అంతరిక్ష పరిశోధనలు గత శతాబ్ధ కాలంలో బాగా పెరిగాయి. అక్కడ నిర్మాణాలు చేపట్టాలని ఇప్పటికే చాలా ప్రయోగాలు చేశారు. వీటిలో ఒక పౌండ్ ఇటుకలను స్పేస్కు చేర్చడానికి రూ. 7.5 లక్షల ఖర్చు అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ ఖర్చు కాల క్రమేణా తగ్గుతుందంటున్నారు. సాధారణంగా ఇటుకలను ఒకదానికి ఒకటి జత చేయడానికి సిమెంట్ను ఉపయోగిస్తారు. కానీ ఈ ఇటుకలను కలపడానికి చిక్కుడు కాయల గుజ్జును వాడుతున్నారు. వీటి నిర్మాణంలో కెమికల్, మెకానికల్ ఇంజనీరింగ్ రెండు కలిసి ఉన్నాయని ఐఐఎస్సీ, బెంగుళూరు అసిస్టెంట్ ప్రొఫెసర్ అలోక్ వెల్లడించారు. ఇస్రోతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. దీంతో త్వరలోనే చంద్రునిపై చేపట్టనున్న నిర్మాణాలలో ఇండియా ప్రముఖ పాత్ర పోషించనున్నట్లు అర్థం అవుతోంది.